Nirmala on NPS | నేషనల్ పెన్షన్ స్కీమ్ (National Pension Scheme – NPS).. ఇది ప్రభుత్వోద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పెన్షన్ నిధి. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికోసం ఏర్పాటు చేసిన పెన్షన్ ఫండ్ ఈ ఎన్పీఎస్.. ప్రతి నెలా ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తం తీసుకుని.. అంతే మొత్తం ప్రభుత్వం.. ఎన్పీఎస్ ఫండ్లో జమ చేస్తుంది. సంబంధిత ఉద్యోగి రిటైర్మెంట్ నాటికి జమ చేసిన మొత్తంలో సగం రిటైర్మెంట్ బెనిఫిట్గా అందచేస్తారు. మిగతా మొత్తం నిధిని వివిధ పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయగా వచ్చిన లాభాలను నెలవారీ పెన్షన్గా అందచేస్తారు.
2004 జనవరి ఒకటో తేదీకి ముందు కొలువులో చేరిన ప్రభుత్వోద్యోగుల కోసం అమల్లో ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీం.. ఇందులో చేరిన ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తం ఓపీఎస్లో జమ చేస్తారు. పదవీ విరమణ చేసేనాటికి ఉద్యోగి కనీస వేతనం, డీఏలో 50 శాతం కలిపి సంబంధిత రిటైర్డ్ ఉద్యోగికి పెన్షన్గా ఇస్తారు. కానీ ఎన్పీఎస్లో జమ చేసిన మొత్తంలో తమ వాటా తమకు ఇవ్వాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదేం కుదరదని తెగేసి చెప్పారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్లో బడ్జెట్ అనంతర చర్చల్లో పాల్గొన్న నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఎన్పీఎస్ కింద ఉద్యోగ భవిష్యత నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు జమ చేసిన మొత్తం తమకు ఇవ్వాలని రాష్ట్రాలు భావిస్తున్నాయన్నారు. అటువంటి అవకాశమే లేదని చెప్పారు. కేంద్రం ఎన్పీఎస్ నిధులు ఇస్తుందని రాష్ట్రాలు ఆశలు పెంచుకోవద్దని, అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
`ఎన్పీఎస్ నిధిపై అధికారం సంబంధిత ఉద్యోగులదే. ఆ డబ్బుపై వచ్చే వడ్డీ కూడా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల చేతికే వస్తుంది. కానీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం సాధ్యం కాదు` అని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్లో కేంద్రం జమచేసే నిధుల వాటా 14 శాతానికి పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వివేక్ జోషి మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ.. కేంద్రాన్నీ అదే పాలసీ అమలు చేయాలనడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఎన్పీఎస్ సొమ్ములో తమ వాటా వెనక్కు ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. కానీ చట్టం ప్రకారం అలా రాష్ట్రాలకు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారాయన.
ఇటీవల హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక బహిర్గతమైనప్పటి నుంచి అదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనమైన వేళ.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్పీఎస్ నిధులు షేర్ మార్కెట్లో పెట్టి ఉద్యోగులను వారి కర్మకు వదిలేయడం సరి కాదని ఫైర్ అయ్యారు. ఎన్పీఎస్ నిధులు రాష్ట్రాలకు ఇచ్చేయాలని, లేదంటే తాము సుప్రీంకోర్టుకెళతామని హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది. నేషనల్ పెన్షన్ స్కీం లేదా పాత పెన్షన్ స్కీమ్ల్లో ఏ విధానం అమలు చేయాలన్నది రాష్ట్రాల పరిధిలోని అంశం అని ఇంతకుముందు పలుసార్లు కేంద్రం వివరణ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీతోపాటు కొన్ని విపక్షాలు.. నేషనల్ పెన్షన్స్కీమ్ను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాయి. ఈ బాటలోనే సాగేందుకు పంజాబ్ సర్కార్ కూడా సిద్ధమైంది. ఓపీఎస్ విధానంలో ఉద్యోగి రిటైర్మెంట్ నాటి కనీస వేతనం, డీఏలో సగం పెన్షన్గా అందుతుంది. ఫిట్మెంట్ ప్లస్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ కూడా పెరుగుతుంది. ఈ పెన్షన్.. సీపీఎస్ పెన్షన్ కంటే ఎక్కువగా ఉండటంతో రిటైర్మెంట్ తర్వాత తమ జీవితానికి భరోసా ఇస్తుందని ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగి మృతి చెందితే.. ఆ వ్యక్తి జీవిత భాగస్వామి లేదా దివ్యాంగులైన పెండ్లి కానీ పిల్లలకు సగం పెన్షన్ వస్తుంది.