హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరినాటికి కొత్తగా చేపట్టిన నాలుగు ఓపెన్ కాస్గ్ బొగ్గు గనులతోపాటు వచ్చే ఏడాది మరో నాలుగు ప్రాజెక్టుల నుంచి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. గురువారం సింగరేణి భవన్లో జరిగిన సమీక్ష సమావేశంలో నూతన గనులు, ఉత్పత్తిపై ఆయన సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నైనీ(ఒడిశా), వీకే కోల్మైన్(కొత్తగూడెం ప్రాంతం), రొంపేడ్ ఓసీ(ఇల్లందు ప్రాంతం), గోలేటి ఓసీ(బెల్లంపల్లి ప్రాంతం) గనులను అందుబాటులోకి తేవడానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నైనీ గనులకు సంబంధించి రైల్వే ట్రాక్, ఇతర పనులను ఈ డిసెంబర్లోగా పూర్తి చేసి, వచ్చే జనవరి నుంచి 100 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అలాగే వీకే కోల్మైన్, రొంపేడ్ ఓసీలకు సంబంధించి రావాల్సిన అటవీ అనుమతులను అక్టోబర్ నాటికి సాధించి, డిసెంబర్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాదిలో వీకే కోల్మైన్ నుంచి 40 లక్షల టన్నులు, రొంపేడ్ నుంచి 20 లక్షల టన్నులు, గోలేటీ ఓసీ నుంచి 35 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలనుకుంటున్నది. మొత్తంగా ఈ నాలుగు గనుల నుంచి 200 లక్షల టన్నుల బొగ్గు అదనంగా ఉత్పత్తి కానున్నది.