హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో రాజన్ పలు సూచనలు చేశారు. రాజన్తోపాటు డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల సులభతర వ్యాపార విధానాల మీద ఆధారపడే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయన్న రాజన్.. స్టార్టప్లను ఎకువగా ప్రోత్సహిస్తే మరింత ఉపయోగం ఉంటుందని గుర్తుచేశారు. తమిళనాడు తరహాలో పారిశ్రామిక విధానం ఉంటే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చునని ఆయన సూచించడం గమనార్హం. కాగా, పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యతోపాటు వైద్య విద్య సిలబస్లో ఏఐ ఉపయోగంపై కమిటీ ఏర్పాటు చేస్తామని.. తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాజన్ను కోరారు. అయితే సరైన పద్ధతిలో ఏఐని వినియోగిస్తే అందరికి మేలే జరుగుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే 3-4 నెలల్లో హైదరాబాద్ పర్యటనకు వస్తానన్నారు.