ముంబై, జూలై 2: దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు నెలకొనడం, అమెరికా బాండ్ రాబడుల్లో పెరుగుదల వంటి కారణాలతో విదేశీ మదుపర్లు జూన్ నెలలో ఏకంగా రూ.49,340 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.2.7 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నట్టు అయింది.
2025లో విక్రయించిన రూ.1.66 లక్షల కోట్ల కంటే ఇది రెండింతలు అధికం. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.22,615 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్పీఐలు..మిగతా నెలల్లో వెనక్కి తీసుకున్నారు. జనవరి నెలలో రూ.35,962 కోట్లు, మార్చిలో రూ.1.17 లక్షల కోట్లు, ఏప్రిల్లో రూ.60 వేల కోట్లు మే నెలలో రూ.32,963 కోట్లు, జూన్లో రూ.49,340 కోట్ల చొప్పున ఉపసంహరించుకున్నారు.