Adani Group | సత్యనారాయణ ప్రైవేట్ ఉద్యోగి. కొడుకు ఉన్నత చదువుల కోసమని ప్రతీనెల జీతంలో కొంత మొత్తం పొదుపు చేసి.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టాడు. అయితే, ఇప్పుడు ఆ డబ్బు ప్రమాదంలో పడే దుస్థితి వచ్చింది. ఇది ఒక్క సత్యనారాయణ సమస్యే కాదు. భవిష్యత్తు కుటుంబ అవసరాల కోసమని దేశంలోని లక్షలాది మంది మధ్యతరగతి ప్రజలు.. మ్యూచువల్ ఫండ్లు, సిప్లలో (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) దాచుకొంటున్న పైసలకు ఇప్పుడు భద్రత లేకుండా పోయింది. అదానీ గ్రూప్నకు చెందిన ఐదు కంపెనీలను ఇండెక్సుల్లోకి తీసుకొంటూ ఎన్ఎస్ఈ సబ్ కమిటీ తాజాగా నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణం.
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ మోసాల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ వల్ల తమ మదుపర్లకు, పౌరులకు ఎలాంటి ఆర్థిక నష్టం కలగకూడదని విదేశీ సంస్థలు పలు కఠిన నిర్ణయాలు తీసుకొన్నాయి. సస్టెయినబిలిటీ సూచీల నుంచి అదానీ కంపెనీలను అమెరికా ఇండెక్స్ ప్రొవైడర్ ఎస్ అండ్ పీ డోజోన్స్ బయటకు పంపించడం, తమ ఇండెక్స్ల్లోని నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల ఫ్రీ ఫ్లోట్స్ను (అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ట్రేడ్ చేసేందుకు అందుబాటులో ఉన్న షేర్ల పరిమాణం) తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ ఇండెక్స్ల ప్రొవైడర్ ‘మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్’ (ఎంఎస్సీఐ) నిర్ణయించడం ఇందులో భాగమే. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు దేశ ప్రజల ఆర్థిక ప్రయోజనాల కంటే, కార్పొరేట్ల బాగే ధ్యేయంగా మారిపోయింది. అందుకే, ఇప్పటికే, రూ. 12 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయిన అదానీ గ్రూప్ కంపెనీలను.. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ ఆఫ్ ఇండియాలోని (ఎన్ఎస్ఈ) నిర్ణీత సూచీల్లోకి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకొన్నది.
ఎన్ఎస్ఈలోని నిఫ్టీ 50, నిఫ్టీ 500, నిఫ్టీ నెక్స్50 సహా మొత్తం 42 ఇండెక్స్ స్టాక్లలో ఎన్ఎస్ఈ ఈక్విటీ ఇండెక్స్ మేయింటనెన్స్ సబ్ కమిటీ మార్పులు చేసింది. ఈ మేరకు అర్ధవార్షిక సమీక్షలో వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 17న అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయంతో నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100 సూచీల్లో అదానీ విల్మార్ చేరనున్నది. నిఫ్టీ 500, నిఫ్టీ 200, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ మిడ్క్యాప్ 150, నిఫ్టీ లార్జ్ మిడ్క్యాప్ 250, నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 ఇండెక్స్లలో అదానీ పవర్ భాగం కానున్నది. నిఫ్టీ షరియా 25లో అదానీ టోటల్ గ్యాస్ చేరనున్నది. ఇలా అదానీ గ్రూప్నకు చెందిన ఐదు కంపెనీలు మొత్తంగా 14 సూచీల్లో చేరనున్నాయి. ఈ మార్పులన్నీ మార్చి 31, 2023 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్ఎస్ఈ తెలిపింది.
హిండెన్బర్గ్ నివేదికతో గడిచిన 30 రోజుల్లో అదానీ గ్రూప్ కంపెనీలు రూ.12 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి. అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు ఇప్పటికే వేల కోట్లను నష్టపోయాయి. దీంతో నిఫ్టీ 50 నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ సెజ్ను మినహాయించాలన్న డిమాండ్లు పెద్దయెత్తున వస్తున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని ఎన్ఎస్ఈ బోర్డు.. కొత్తగా మరో ఐదు అదానీ కంపెనీలను సూచీల్లోకి చేర్చుకోవడంపై ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. లక్షలాది మంది పౌరులు పొదుపు చేసుకొంటున్న కోట్లాది రూపాయల్ని… మునిగిపోతున్న అదానీ గ్రూప్ కంపెనీల స్టాకుల్లో పెట్టుబడులుగా పెట్టకుండా ఎన్ఎస్ఈ బోర్డు, సెబీ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అర్ధవార్షిక సమీక్షలో భాగంగా జనవరి 31, 2022 వరకు ఉన్న కంపెనీల డాటా ప్రకారం.. సూచీల్లోకి అదానీ కంపెనీలను తీసుకొన్నట్టు ఎన్ఎస్ఈ ఇండెక్స్ మేయింటనెన్స్ సబ్ కమిటీ ప్రకటనలో వెల్లడించింది. అయితే, అదానీ గ్రూప్లో అవకతవకల ఉదంతం నెల కిందటే బయటపడింది. ఇలాంటి సమయంలో అలాంటి నష్టదాయక షేర్లు ఉన్న కంపెనీలను ఎప్పుడో ఏడాది కిందటి పర్ఫార్మెన్స్ను బట్టి సూచీల్లోకి తీసుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సంక్షోభ పరిస్థితుల్లో ఇండెక్సింగ్ మెథడాలజీలోని ప్రొవిజన్లను సవరించే అవకాశమున్నప్పటికీ సబ్ కమిటీ ఆ దిశగా చర్యలు చేపట్టట్లేదని, ఇదంతా కొందరికి లబ్ధి చేకూర్చడంలో భాగంగా తీసుకొన్న నిర్ణయమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్ఎస్ఈ సబ్-కమిటీ తీసుకొన్న ఈ నిర్ణయంపై ఎన్ఎస్ఈ బోర్డ్ ఆఫ్ డెరెక్టర్లు వెంటనే జోక్యం చేసుకోవాలి. సబ్-కమిటీ తాజా నిర్ణయంపై సమీక్ష నిర్వహించాలి. ఎందుకంటే, ఇది డబ్బులను పొదుపు చేసుకొనే రిటైల్ ఇన్వెస్టర్లకు సంబంధించిన పెద్ద విషయం. అలాగే అదానీ గ్రూప్లో జరిగిన అవకతవకలపై సెబీ వెంటనే దర్యాప్తు జరుపాలి.
– జైమినీ భగవతీ, సీఎస్ఈపీ విశిష్ట సభ్యుడు, ఆర్థిక నిపుణులు
అదానీ ఉదంతం విషయంలో ఎంఎస్సీఐ తీసుకున్న నిర్ణయాన్నే ఎన్ఎస్ఈ తీసుకోవాల్సింది. అయితే, అలా జరుగలేదు. అదానీ గ్రూప్ స్టాక్లను అతికొద్ది మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మాత్రమే దగ్గర పెట్టుకొన్నాయి. రిస్క్కు సిద్ధమయ్యేవాళ్లే అలా చేస్తారు.
– రాఘవేంద్రనాథ్, ఎండీ, ల్యాడర్అప్ వెల్త్
(స్పెషల్ టాస్క్ బ్యూరో)