రిజర్వ్బ్యాంక్ పాలసీలో వడ్డీ రేట్లు యథాతథంగా అట్టిపెట్టినా, సీఆర్ఆర్ రూపంలో బ్యాంక్ల నుంచి అదనపు నిధుల్ని తీసుకోవడం, ద్రవ్యోల్బణం అంచనాల్ని పెంచడంతో పాటు ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్కావడంతో వరుసగా మూడవ వారమూ భారత్ సూచీలు తగ్గాయి. గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 89 పాయింట్లు క్షీణించి 14,428 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 15 సెలవు కారణంగా నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగే ఈ వారంలో నిఫ్టీ పరిమిత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టు డెరివేటివ్ సిరీస్ మొదలైననాటి నుంచి లాంగ్ పొజిషన్లు ఆఫ్లోడ చేసి, షార్ట్ ఎక్స్పోజర్ పెంచుకుంటున్నట్టు సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది చెప్పారు. మార్కెట్లో కరెక్టివ్ కన్సాలిడేషన్ జరుగుతున్నందున, ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని, ఎంపికచేసిన షేర్లలో పరిమితంగా పొజిషన్లు తీసుకోవాలని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ సూచించారు.
నిఫ్టీ 19,300-19,750 శ్రేణిని బ్రేక్ చేసేంతవరకూ నిర్దేశిత శ్రేణిలో కన్సాలిడేషన్ జరుగుతుందని మిలన్ వైష్ణవ్ తెలిపారు. ఈ వారం నిఫ్టీకి 19,350, 19,200 స్థాయిల వద్ద మద్దతు లభించవచ్చని, 19,580, 19,650 స్థాయిలు అవరోధం కల్పించవచ్చని అంచనా వేశారు. 19,650 స్థాయిని బలంగా అధిగమిస్తేనే తాజా కొనుగోళ్లు జోరందుకుంటాయని జిమిత్ మోది విశ్లేషించారు. నిఫ్టీకి 19,400 పాయింట్ల వద్ద స్వల్పకాలిక మద్దతు ఉందని, ఈ స్థాయిని కోల్పోతే ఇటీవలి కనిష్ఠస్థాయి 19,300 వద్దకు క్షీణిస్తుందని అంచనా వేశారు.