న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), భారత్ మధ్య తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అధారిటీ (జీసీఏఏ) ప్రకటించింది. భారత్, ఇతర దేశాల్లో కరోనా వైరస్ ఉధ్రుతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణికుల విమాన సర్వీసులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.
భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నట్లు జీసీఏఏ అధికారి ఒకరు చెప్పారు. భారత్లో పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్నారు. అందరి ఆరోగ్యం, భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
యూఏఈ మీదుగా భారత్కు వెళ్లే అంతర్జాతీయ విమానాలకు మాత్రం మినహాయింపులు ఇస్తున్నట్లు జీసీఏఏ పేర్కొంది.
రెండు దేశాల దౌత్య అధికారులు, అధికారిక ప్రతినిధులు, వ్యాపారవేత్తల విమానాలు, గోల్డెన్ రెసిడెంట్ హోల్డర్లకు ఇంతకుముందు మినహాయింపు ఇచ్చామని జీసీఏఏ తెలిపింది.
అయితే, వారు విమానాశ్రయంలో దిగగానే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవడంతోపాటు 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని వ్యాఖ్యానించింది.
గత ఏప్రిల్ 24 నుంచి భారత్ నుంచి వచ్చే అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ డిజాస్టర్స్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్సీఈఎంఏ) రద్దు చేసింది. రెండు దేశాల ఎయిర్లైన్స్ మాత్రం జూలై ఆరో తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని భావిస్తున్నాయి.
ఈ నెల ప్రారంభంలో భారత్-యూఏఈ మధ్య విమాన సర్వీసులను జూలై 6 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ పేర్కొంది. కేంద్ర విమానయాన సంస్థ కూడా జూలై 6 వరకు ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది.