Raghuram Rajan on OPS | పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేయడం వల్ల దీర్ఘకాలికంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రఘురామ్ రాజన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. పాత పెన్షన్ విధానానికి బదులు ఇతర మార్గాలు పరిశీలించాలని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురామ్ రాజన్ చెప్పారు.
ప్రస్తుత వేతనాల ప్రకారం పాత పెన్షన్ విధానం అమలుతో భవిష్యత్లో తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని రఘురామ్ రాజన్ స్పష్టం చెప్పారు. పాత పెన్షన్ విధానానికి మారడం తాత్కాలికం కాదని, దీర్ఘకాలికంగా కొనసాగించాలన్నారు. ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడనున్న నేపథ్యంలో ఓపీఎస్కు మారాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ విషయమై పునరాలోచించాలని సూచించారు. పాత పెన్షన్ స్కీం టెక్నికల్గా, లీగల్గా అసాధ్యం అని తెలిపారు. కనుక ఓపీఎస్కు బదులు తక్కువ భారం పడే ఇతర మార్గాలు పరిశీలించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు చెప్పారు.
ఇప్పటికే పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)లోకి మారనున్నట్లు జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ వంటి రాష్ట్రాలు నిర్ణయించాయి. ఈ సంగతి కేంద్రానికి తెలిపాయి. పంజాబ్ కూడా అదే బాటలో వెళుతున్నట్లు తెలిపింది. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే రిటైర్మెంట్ నాటి వేతనంలో సగం వేతనం పెన్షన్గా ఇవ్వాలి. 2003లో నాటి ఎన్డీఏ సర్కార్.. పాత పెన్షన్ స్కీం రద్దు చేసి, కొత్త పెన్షన్ విధానం అమల్లోకి తెచ్చింది.
కొత్త పెన్షన్ పథకం ప్రకారం ప్రతి ఉద్యోగి తన కనీస వేతనంలో 10 శాతం మొత్తం పెన్షన్ నిధిలో డిపాజిట్ చేయాలి. ప్రభుత్వం 14శాతం వాటా డిపాజిట్ చేస్తుంది. అయితే, 2003 డిసెంబర్ 22వ తేదీకి ముందు జారీ అయిన ఉద్యోగ నియామకాల ప్రకటనలతో ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ విధానం ఎంచుకునే చాన్స్ కేంద్రం ఇటీవల కల్పించడం ఆసక్తికర పరిణామం.