NIMZ | జహీరాబాద్, జనవరి 8: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో రూపుదిద్దుకుంటున్న ‘జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్)’లో పరిశ్రమల స్థాపన మొదలైంది. వెనుకబడిన జహీరాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం నిమ్జ్కు రూపకల్పన చేసింది. ఈ రెండు మండలాల్లోని 17 గ్రామాలు, 12,635 ఎకరాల్లో నిమ్జ్ను నెలకొల్పడం, రూ.31 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, సుమారు 2.66 లక్షల మందికి ప్రత్యకంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అవసరమైన భూములను రైతుల నుంచి సేకరించడమే కాకుండా పలు పరిశ్రమలకు భూములు కేటాయించింది.
దీంతో అక్కడ పరిశ్రమల స్థాపనకు పలువురు దేశ విదేశీ వ్యాపారవేత్తలు ముందుకొచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన పారిశ్రామిక సమీక్షలో సైతం జహీరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించడం విశేషం. పారిశ్రామిక అభివృద్ధికి మాస్టర్ పాలసీ రూపొందించాలని కూడా ఆధికారులను ఆదేశించారు. జహీరాబాద్లో కొత్తగా ఆటోమొబైల్, ఐటీ, ఫార్మా, హెల్త్కేర్, ఆహారశుద్ధి, క్రీడలు, ఆర్గానిక్ క్లస్టర్లు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు రక్షణ, నావికా రంగానికి అవసరమైన పరికరాలను తయారు చేసే పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పారిశ్రామిక ఖిల్లాగా నిమ్జ్
ఒప్పందం చేసుకున్న ప్రకారం అన్ని సంస్థలూ తమ పరిశ్రమలను స్థాపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తే, రానున్న రోజుల్లో నిమ్జ్ పారిశ్రామిక ఖిల్లాగా మారనున్నది. ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయి, స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భూముల ధరలు మరింతగా పెరగనున్నాయి. నిమ్జ్కు రాకపోకలు సాగించేందుకు ఎన్హెచ్-65 ఉగ్గెళ్లి చౌరస్తా నుంచి నిమ్జ్ ఏర్పాటు చేస్తున్న ఎల్గోయి శివారు వరకు రూ.100 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నాలుగు వరుసల రోడ్డు పనులు చివరి దశకు చేరుకున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కొన్ని సంస్థలు