న్యూఢిల్లీ, ఆగస్టు 24: పెట్టుబడుల ఉపసంహరణలతో ప్రభుత్వ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూపోతున్న మోదీ సర్కారు.. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంక్ను ప్రైవేటీకరణ పట్టాలపైకి తీసుకొస్తున్నది. ఇప్పటికే బ్యాంక్లో తనకున్న వాటాను సగానికిపైగా అమ్ముకున్న కేంద్రం.. ఇక మేనేజ్మెంట్ హక్కునూ వదులుకొనేందుకూ సిద్ధమైంది. ఈ క్రమంలోనే మెజారిటీ వాటా విక్రయం దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్లో దాదాపు 94 శాతం వాటా ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వాలదే. దీంతో ఇందులో 51 శాతం వాటాను అమ్మేయాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇటు ఎల్ఐసీ ఉన్నతోద్యోగులు చర్చలు సైతం జరుపుతున్నారు. త్వరలోనే ఓ మంత్రుల బృందం ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
అయితే బ్యాంక్లో ఎంతోకొంత వాటాను మాత్రం ఎల్ఐసీ, కేంద్రం ఉంచుకోవాలనే అనుకుంటున్నట్టు తెలుస్తున్నది. కానీ నిర్ణయాధికారాన్ని మాత్రం వదులుకోవాలనే భావిస్తున్నాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. వాటాను కొనాలనుకునేవారు వచ్చే నెలాఖర్లోగా తమ ఆసక్తిని చెప్పాలని కూడా డెడ్లైన్ పెట్టినట్టు వినిపిస్తున్నది. ఈ అంశంపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఐడీబీఐ బ్యాంక్, ఎల్ఐసీ వర్గాలు నిరాకరించాయి. కాగా, 2019లో ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటాను కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ దక్కించుకున్న విషయం తెలిసిందే.
దేశ బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ను కూడా మోదీ సర్కారు విడిచిపెట్టలేదు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తినే ప్రశ్ని స్తూ దాన్నీ తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని ప్రయత్నించి కేంద్ర పాలకులు అబాసుపాలైన విషయం తెలిసిందే. అయితే డివిడెండ్ల రూపం లో ఆర్బీఐ సొమ్మును మాత్రం పెద్ద ఎత్తున దక్కించుకోగలిగారు. ఇది సరికాదన్న అభిప్రాయాలు ఆర్థిక మేధావుల నుంచి వచ్చినా ఒంటెత్తు పోకడే పోయింది కేంద్రం. ఆర్బీఐ మాజీ గవర్నర్లు రఘురామ్ రాజన్ మూడేండ్లకే వెళ్లిపోవడం, ఊర్జిత్ పటేల్ మధ్యలోనే దిగిపోవడం ఇందుకు నిదర్శనాలు. ఇప్పుడున్న గవర్నర్ శక్తికాంత దాస్ సైతం కేంద్రం నిర్ణయాలపై తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నది చూస్తూనే ఉన్నాం.
విలీనాల పేరుతో ముందుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఏకం చేస్తున్న మోదీ సర్కారు.. ఆపై ఒక్కొక్కటిగా వాటిని అమ్మేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మోదీ హయాంలోనే ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్సహా ఆరు బ్యాంకులు విలీనమయ్యాయి. అలాగే బీవోబీలో దేనా, విజయా బ్యాంకులు, పీఎన్బీలో ఓబీసీ, యూబీఐలు, కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్లో ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్లు, ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ కలిసిపోయాయి. ఐడీబీఐలో మెజారిటీ వాటాను ఎల్ఐసీ కొన్నది. ప్రస్తుతం దేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులే ఉన్నాయి. మునుపు 25కుపైగా ఉండటం గమనార్హం.
ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా బ్యాంకులే వెన్నెముక. అటువంటి కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని విలీనాలు, ప్రైవేటీకరణలతో కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తున్నదిప్పుడు. ఇది ప్రమాదమని సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దగ్గర్నుంచి దేశ, విదేశాల ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నా మోదీ సర్కారు మాత్రం వినిపించుకోవట్లేదు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత ప్రధానం. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు తప్పనిసరి. సర్కారు భరోసానే సగటు మనిషి సొమ్ముకు భద్రత. ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ రకమైన జవాబుదారీతనం ఉండదనేది ఇప్పటికీ సామాన్యుల్లో ఉన్న బలమైన అభిప్రాయం. అయినప్పటికీ సర్కారీ బ్యాంకుల సంఖ్యను తగ్గించడం, ఆపై ప్రైవేట్పరం చేయడమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుండటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది.
‘భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుతున్నది ప్రభుత్వ రంగ బ్యాం కులే. ప్రస్తుతం బ్యాంక్ రుణాలు, డిపాజిట్ల మధ్య పొంతనే లేదు. రుణాల సగటు కాలవ్యవధి దాదాపు 9 సంవత్సరాలుగా ఉన్నది. డిపాజిట్ల కాలపరిమితి మాత్రం రెండున్నరేండ్లుగానే ఉన్నది. అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు రావడం లేదంటే దేశీయ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటానే ఎక్కువ కాబట్టి. సర్కారీ బ్యాంకుల మూలధన అవసరాలను ప్రభుత్వం తీరుస్తుండటం వల్లే సమస్యలు రావడం లేదు. అంతా ప్రైవేట్ బ్యాంకులైతే ఇప్పుడున్న పరిస్థితికి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థే కుప్పకూలేది. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలు, ప్రైవేటీకరణల నేపథ్యంలో ఏ క్షణమైనా ప్రమాదం పొంచి ఉన్నదనే చెప్పాలి’
-ప్రణబ్ సేన్, ప్రణాళికా సంఘం మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు