Adani Group | పిల్లల ఉన్నత చదువుల కోసమని ఒకరు.. బిడ్డ పెండ్లికోసమని మరొకరు మలిసంధ్యలో మందులకు సాయపడుతుందని ఇంకొకరు… ఇలా, భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసమని.. వచ్చే అత్తెసరు జీతంలోనే కొంత సొమ్మును దాచుకొంటున్న సగటు ఉద్యోగి కష్టార్జితానికి ఇప్పుడు ధీమా కరువైంది. నష్టాల్లో ఉన్నాయన్న విషయం తెలిసినప్పటికీ, అదానీ గ్రూప్ కంపెనీల్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) అడ్డగోలుగా పెట్టుబడులు పెడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
మొన్న: అదానీ కంపెనీలకు రూ. 80 వేల కోట్ల పైచిలుకు రుణాలిచ్చి ప్రభుత్వ బ్యాంకులు, తనవద్ద ఉన్నది సామాన్యుల సొమ్ము అన్న సోయి కూడా లేకుండా అదానీ కంపెనీల్లో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ మూకుమ్మడిగా చేతులు కాల్చుకొన్నాయి.
నిన్న: ఎన్ఎస్ఈ సూచీల్లో అదానీ కంపెనీలు భాగంగా ఉన్నందున మ్యూచువల్ ఫండ్స్పైనా, ఈ ఫండ్స్లో పెట్టుబడి చేసిన సంస్థలపైనా నీలినీడలు ముసురుకున్నాయి.
నేడు: దేశంలోని కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారుల సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. నష్టాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో.. ఈపీఎఫ్వో అడ్డగోలుగా పెట్టుబడులు పెడుతుండటమే దీనికి కారణం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) అనాలోచిత నిర్ణయంతో ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. అదానీ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ‘హిండెన్బర్గ్’ నివేదిక ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఆ గ్రూప్ కంపెనీల్లో ఈపీఎఫ్వో అడ్డగోలుగా పెట్టుబడులు పెడుతుండటమే దీనికి కారణం. అదానీ గ్రూప్నకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో.. ఈపీఎఫ్వో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లను పెట్టినట్టు, వచ్చే సెప్టెంబర్ నాటివరకూ ఈ పెట్టుబడుల ప్రక్రియ కొనసాగించనున్నట్టు తెలుస్తున్నది.
స్టాక్ మార్కెట్లోని ఇండెక్స్ల్లో ఒకటైన నిఫ్టీ 50 సరళి ప్రకారం ఇన్వెస్ట్చేసే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఈపీఎఫ్వో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నది. స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్వో చేసే పెట్టుబడుల్లో అధికంగా 85 శాతం ఇండెక్స్ల ఆధారిత ఈటీఎఫ్ల్లోకే వెళుతున్నాయి. నిఫ్టీ 50 సూచీలో 2015 సెప్టెంబర్లో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ భాగం కాగా, గత సెప్టెంబర్లో అదానీ ఎంటర్ప్రైజెస్ను చేర్చేందుకు ఎన్ఎస్ఈ ఇండెక్స్ కమిటీ అనుమతించింది. కిందటేడాది మార్చి నాటికి ఈటీఎఫ్లలో ఈపీఎఫ్వో రూ. 1.57 లక్షల కోట్లు పెట్టుబడులుగా పెట్టింది. ప్రస్తుత ఏడాది మరో రూ.8 వేల కోట్ల ఈపీఎఫ్వో పెట్టుబడులు వచ్చాయని అంచనా. ఈ సొమ్ములో కొంత భాగం ప్రధాన ఇండెక్స్లో భాగమైన అదానీ కంపెనీల్లోకి చేరింది. అయితే, అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో.. తమ మదుపర్లకు, పౌరులకు ఎలాంటి ఆర్థిక నష్టం కలగకూడదని పలు విదేశీ సంస్థలు అదానీ కంపెనీలతో లావాదేవీలను నిలిపేశాయి. ఇంత జరుగుతున్నప్పటికీ, ఈపీఎఫ్వో తన పంథా మార్చుకోవట్లేదు. ఈటీఎఫ్ ద్వారా అదానీ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లను నిలిపివేయట్లేదు. వచ్చే సెప్టెంబర్ వరకూ.. ఈటీఎఫ్లో పెట్టుబడులను కొనసాగించడానికి ఈపీఎఫ్వో నిర్ణయించినట్టు సమాచారం. అంటే, నష్టాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో ఈటీఎఫ్ ద్వారా పీఎఫ్ ఖాతాదారుల డబ్బును ఈపీఎఫ్వో పెట్టుబడులుగా పెడుతుందన్న మాట. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 38 వేల కోట్లను ఈటీఎఫ్లో ఈపీఎఫ్వో పెట్టుబడులుగా పెట్టనున్నట్టు తెలుస్తున్నది. ఈపీఎఫ్వో నిర్ణయంపై పీఎఫ్ ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో 1952లో ఈపీఎఫ్వో ప్రారంభమైంది. తొలినాళ్లలో మూడు శాతం చొప్పున వడ్డీ చెల్లించేవారు. 1977-88 నాటికి అది 8 శాతానికి చేరింది. 1989-90లో ఒకానొక దశలో గరిష్ఠంగా 12 శాతం వడ్డీ చెల్లించిన చరిత్ర ఈపీఎఫ్వోకు ఉన్నది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్ వడ్డీరేటుపై ఈపీఎఫ్వో భారీగా కోత విధించింది. ఈపీఎఫ్ జమలపై 8.1 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది. 45 ఏండ్లలో ఇదే కనిష్ఠం. ఒకవైపు నష్టాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెడుతూ.. పీఎఫ్ ఖాతాదారుల సొమ్మును ప్రమాదంలోకి నెడుతున్న ఈపీఎఫ్వో.. ఖాతాదారులకు ఇచ్చే వడ్డీరేటులో మాత్రం అంతకంతకూ కోత విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం అదానీ గ్రూపునకు చెందిన షేర్లు పడిపోయాయి. స్టాక్ మార్కెట్లో లిైస్టెన పది సంస్థల షేర్లు 5 శాతం వరకు నష్టపోయాయి. వీటిలో అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్లు ఐదు శాతం వరకు నష్టపోగా..ఎన్డీటీవీ 4.60 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 4.40 శాతం, అదానీ పోర్ట్స్ 1.43 శాతం, ఏసీసీ 1.01 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్, అంబుజా షేర్లూ నష్టపోయాయి.