PF Interest | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటును మూడేండ్ల గరిష్ఠస్థాయికి పెంచింది. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ నిధులపై 8.25 శాతం వడ్డీ చెల్లించాలని నడిచే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) ట్రస్టీల కేంద్ర బోర్డు నిర్ణయించినట్టు కార్మిక శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సుచేసింది. వడ్డీ రేట్ల పెంపుదల 8 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
గత మూడేండ్లలో ఇదే అత్యధిక రేటు. 2019-20లో 8.5 శాతం వడ్డీని చెల్లించిన ఈపీఎఫ్వో 2020-21లో సైతం అదే రేటును కొనసాగించింది. అటుతర్వాత 2021-22లో వడ్డీ రేటును ఒకేసారి నాలుగు దశాబ్దాల కనిష్ఠస్థాయి 8.1 శాతానికి తగ్గించింది (1977-78లో 8 శాతం). 2022-23లో స్వల్పంగా పెంచి 8.15 శాతం చెల్లించింది. 2023-24 సంవత్సరానికి తాజాగా ప్రకటించిన 8.25 శాతం రేటు సిఫార్సు ఆర్థిక శాఖ చెంతకు వెళుతుంది. దానికి ఆమోదం అందుకున్న తర్వాత ఈపీఎఫ్ చందాదారుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీని జమచేస్తారు. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన శనివారం జరిగిన ఈపీఎఫ్వో ట్రస్టీల బోర్డు 235వ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును పెంచాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
ఆర్థిక శాఖ అనుమతి లభించిన తర్వాత కొత్త వడ్డీ రేటుపై గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని, ఆమోదిత రేటుపై వడ్డీని ఈపీఎఫ్వో చందాదారుల ఖాతాల్లో జమచేస్తుందని ప్రకటన వివరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లో ఉన్న అసలు మొత్తం రూ.13 లక్షల కోట్లుకాగా, దానికి రూ.1,07,000 కోట్లు వడ్డీ చెల్లించాలని బోర్డు సిఫార్సుచేసింది. గత ఏడాది రూ.11.02 లక్షల కోట్ల అసలుపై రూ.91,151 కోట్ల వడ్డీని జమచేశారు. తాజాగా సిఫార్సుచేసిన వడ్డీ సొమ్ము రికార్డు గరిష్ఠమని, అసలు 17.97 శాతం పెరిగినందున, వడ్డీ చెల్లింపు మరింత అధికమయ్యిందని ప్రకటన పేర్కొంది.