Elon Musk : ఏఐ మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందనే ఆందోళనలపై టెస్లా చీఫ్, ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన గ్రేట్ ఏఐ డిబేట్ వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పుల గురించి మస్క్ మాట్లాడారు. ఏఐతో మానవాళికి ప్రమాదకర ముప్పు పొంచిఉండే అవకాశం 10 నుంచి 20 శాతం వరకూ ఉందని అన్నారు. కానీ ఏఐతో ముప్పు కంటే అది అందించే ప్రయోజనాలు విలువైనవని మస్క్ ఇప్పటికీ భావిస్తున్నారు.
ఏఐతో మానవాళి అంతమవుతుందనేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయనేది తన ఆలోచనని, ఏఐతో మనుషులకు 10 నుంచి 20 శాతం వరకూ ముప్పు ఉంటుందని జెఫ్ హింటన్ అంచనాతో తాను ఏకీభవిస్తానని మస్క్ చెప్పుకొచ్చారు. అయితే ఏఐతో అందివచ్చే సానుకూల అంశాలతో ప్రతికూల ప్రభావాలను అధిగమించవచ్చని అన్నారు. ఏఐ మానవాళికి విఘాతం కలిగిస్తుందని గత ఏడాది నవంబర్లో మస్క్ చెప్పుకొచ్చారు. ఏఐ నియంత్రణకు నిబంధనలు అవసరమని నొక్కిచెప్పిన మస్క్ ఏఐని మెరుగుపరుస్తూ ఓపెన్ఏఐకి దీటుగా సొంతంగా xAI పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు.
ఇక గ్రేట్ ఏఐ డిబేట్లో మస్క్ మాట్లాడుతూ 2030 నాటికి ఏఐ మనుషుల కంటే తెలివిమీరుతుందని, ఇది తీసుకువచ్చే ప్రతికూల ప్రభావాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని మస్క్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎదుగుదల అనేది మనం పిల్లలను పెంచడం వంటిదని, సూపర్ జీనియస్గా, దేవుడి తరహా ఇంటెలిజెన్స్ కిడ్ను పెంచడం..ఇదంతా పిల్లలను మీరు ఎలా ఎదిగేలా చేస్తారనే దానిపై ఆధారపడిఉంటుందని మస్క్ చెప్పారు.