(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేండ్ల పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు 300 శాతం వరకు పెరిగాయి. బియ్యం, పాలు, పప్పు, చింతపండు ఇలా దేన్ని ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులు కడుపునిండా తినడానికి కూడా భయపడే దుస్థితి దాపురించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో విఫలమైన నరేంద్ర మోదీ సర్కార్పై పేద, మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ‘ద్రవ్యోల్బణం’ అంశం కీలక భూమిక పోషించనున్నట్టు నివేదికలు కూడా చెబుతున్నాయి. నిత్యావసరాల ధరల్లో పెరుగుదల, గృహ వినియోగదారుల ఆదాయం, వ్యయం తదితర అంశాలను ఐదేండ్లకోసారి సేకరించేందుకు నిర్వహించే గృహ వినియోగదారుల వ్యయ సర్వే (సీఈఎస్) తాజా నివేదికను మోదీ ప్రభుత్వం దాచాలనుకొంటున్నట్టు జాతీయ ఇంగ్లీష్ పత్రిక ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ ఓ కథనంలో వెల్లడించింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల తర్వాత ఈ నివేదికను ప్రభుత్వం విడుదల చేయాలనుకొంటున్నట్టు వివరించింది. ఎన్నికల సమయంలో ధరల పెరుగుదలకు సంబంధించి విపక్షాల నుంచి ఎదురవ్వబోయే విమర్శల నుంచి తప్పించుకోవడానికే బీజేపీ సర్కార్ ఈ చర్యలకు సిద్ధపడుతున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలోనూ దాచేశారు..
వినియోగదారుల వ్యయ సర్వేను ఐదేండ్లకోసారి నిర్వహిస్తారు. గత యూపీఏ హయాంలో 2011-12 మధ్య ఈ సర్వేను జరిపారు. అనంతరం 2016-17లో సర్వే నిర్వహించాల్సి ఉండగా… అయితే, కొన్ని కారణాలను చూపుతూ.. బీజేపీ సర్కారు ఏడాది ఆలస్యంగా 2017-18లో నిర్వహించింది. దేశంలోని వేలాది కుటుంబాలు దారిద్య్రరేఖ కంటే దిగువకు జారిపోయినట్టు సర్వేలో తేలింది. దీంతో ఆ సర్వేను విడుదల చేయకుండా అడ్డుకొన్న ప్రభుత్వం.. ‘నాణ్యతా సమస్యలు’ (క్వాలిటీ ఇష్యూస్) తలెత్తాయన్న సాకును తెరపైకి తీసుకొచ్చింది. దీనిపై పెద్దయెత్తున దుమారం రేగింది. అయితే, ఆ సర్వే వివరాలు ఎలాగోలా బయటకు రావడంతో అసలు వాస్తవాలు బహిర్గతమయ్యాయి.. కాగా, 2022-23 సంవత్సరానికి గానూ నిర్వహించిన సీఈఎస్ సర్వే ఫలితాలు వచ్చే జూన్లో విడుదల కావాల్సి ఉన్నది. అయితే, కొత్తగా 2023-24 ఏడాదిని కలుపుకొని రెండింటి ఫలితాలను వచ్చే ఏడాది జూన్లో (లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత) విడుదల చేయాలని కేంద్రం చూస్తున్నది. ధరల పెరుగుదల, వినియోగదారుల పొదుపు ఖాతాలు ఖాళీ అవుతుండటం, పేదరికం పెరిగిపోవడం వల్లే సీఈఎస్ నివేదికను ఎన్నికలు ముగిసే వరకూ దాచిపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్షన్లలో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం ఈ కుట్రలకు పూనుకుంటున్నట్టు పలువురు మండిపడుతున్నారు.