న్యూఢిల్లీ, జూలై 25: గడిచిన ఐదేండ్లలో రూ.20 కోట్లు, ఆపై మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)కు సంబంధించి 490 బ్యాంక్ మోసం కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రికార్డ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) 2002 నిబంధనల కింద వీటిని ఈడీ నమోదు చేసినట్టు మంగళవారం రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. ఈ నెల 20 నాటికి ఈ కేసుల్లో రూ.26,732.68 కోట్ల ఆస్తులు జప్తు చేశారని, 82 మందిని అరెస్టు చేయడమేగాక, 80 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసినట్టు మంత్రి వెల్లడించారు. అలాగే మరో రూ.15,113.02 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పజెప్పినట్టు స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఐదేండ్లదాకా ఎటువంటి రుణ సాయం చేయడం లేదని, ఈ సమయంలో ఎలాంటి కొత్త వెంచర్ల ఏర్పాటుకు అనుమతించడం లేదని, నిధుల సమీకరణ నిమిత్తం క్యాపిటల్ మార్కెట్స్లోకీ వారు ప్రవేశించలేరని మంత్రి చెప్పారు.
పారదర్శకమైన పద్ధతిలో దేశంలోని వివిధ రాష్ర్టాల్లోగల ఎనిమీ ప్రాపర్టీస్ వేలం ప్రక్రియను మొదలు పెట్టినట్టు మంగళవారం లోక్సభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. భారత్ నుంచి వెళ్లిపోయి పాకిస్తాన్, చైనా పౌరసత్వాన్ని తీసుకున్నవారి స్థిరాస్తుల్నే ఎనిమీ ప్రాపర్టీస్గా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా ఈ ఆస్తుల విలువ లక్ష కోట్ల రూపాయలకుపైగానే ఉంటుందని అంచనా. ఈ ఆస్తుల హక్కుదారుల్లో 12,485 మంది పాకిస్తాన్లో, 126 మంది చైనాలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 6,255 ఎనిమీ ప్రాపర్టీస్ ఉండగా, తెలంగాణలోనూ 158 ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం (2022-23) 8.75 లక్షలకుపైగా హిందూ అవిభాజ్య కుటుంబాలు రూ.3,803 కోట్ల ట్యాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలిపింది. అలాగే ఆదాయ పన్ను (ఐటీ) అధికారుల సోదాలు, ఆస్తుల జప్తులు గడిచిన మూడేండ్లకుపైగా కాలంలో పెరిగిపోయాయని చెప్పింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను కేంద్ర పన్నుల్లో, సుంకాల్లో వాటాగా రాష్ర్టాలకు ఇప్పటిదాకా రూ.3.09 లక్షల కోట్లకుపైగా బదిలీ చేశామన్నది. మరోవైపు గత నాలుగేండ్లకుపైగా కాలంలో కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి 4,085 ఫిర్యాదులు అందాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.