న్యూఢిల్లీ : ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ యాప్ డుంజో (Dunzo) ఉద్యోగుల వేతన చెల్లింపులో జాప్యం చేస్తోంది. మేనేజర్, ఆపై స్ధాయి ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం పడుతోంది. మరోవైపు డుంజో మరికొందరు ఉద్యోగులను కూడా సాగనంపేందుకు సన్నద్ధమైందని సమాచారం. నిధులు అందుబాటు లేవనే కారణంతో కంపెనీ ఇప్పటికే ఉద్యోగులకు జూన్ వేతనంలో 50 శాతం మొత్తం బకాయి పడింది.
మేనేజర్ గ్రేడ్ ఆపై స్ధాయి వారితో పాటు ఉద్యోగులందరూ జూన్ వేతనం సగమే అందుకున్నారు. మిగిలిన వేతనాన్ని తర్వాత ఉద్యోగులకు చెల్లిస్తామని కంపెనీ పేర్కొందని చెబుతున్నారు. మిగిలిన వేతనాన్ని జులై 15 నుంచి జులై 25 మధ్య చెల్లిస్తామని కంపెనీ తమకు సమాచారం అందించిందని డుంజోలో పనిచేసే ఓ ఉద్యోగి వెల్లడించారు.
కంపెనీ తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటుండటంతో పునర్వ్యవస్ధీకరణ పేరుతో మరికొందరు ఉద్యోగులపై వేటు తప్పదని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు లేఆఫ్స్కు దిగిన డుంజో తాజా తొలగింపులకు దిగితే ఇది మూడో దశ లేఆఫ్స్ అవుతుంది. ఇక డుంజో ఎంతమంది ఉద్యోగులపై వేటు వేస్తుందనే వివరాలు ఇప్పటివరకూ వెల్లడికాలేదు. కాగా డుంజోలో రిలయన్స్ రిటైల్కు 25.8 శాతం వాటా ఉండగా, గూగుల్ 20 శాతం వాటా కలిగిఉంది.
Read More :
Silvio Berlusconi: గర్ల్ఫ్రెండ్కు 900 కోట్ల వీలునామా రాసిన బెర్లుస్కోనీ