Gold | బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త శిఖరాలను తాకాయి. ఈ క్రమంలో బంగారు ఆభరణాలకు డిమాండ్ 80శాతం వరకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రేత్రలు అమ్మకాలు తగ్గుతున్నాయని చెబుతున్నట్లుగా ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నది. అయితే, ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా కొనుగోళ్లు మందగించాయి. మరో వైపు చైనా డీలర్స్ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించారు.
ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పుత్తడి ధరలు ఆమాంతం పెరుగుతూ వస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఔన్స్కు 2,942.70 డాలర్లకు చేరింది. అయితే, చాలామంది వినియోగదారులు వివాహాల సీజన్ నేపథ్యంలో పసిడిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారని.. కానీ ధరల పెరుగుదల కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ఓ వ్యాపారి పేర్కొన్నారు. ఫోన్ చేసి ధరలు ఎప్పుడు తగ్గుతాయని.. పసిడిని కొనుగోలు చేసేందుకు సరైన సమయం ఎప్పుడో చెప్పాలని పలువురు అడుగుతున్నారని కోయంబత్తూరుకు చెందిన వ్యాపారి ముత్తువెంకట్రామ్ పేర్కొన్నారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం.. 2024లో భారత దేశంలో బంగారం వినియోగం 563.4 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది చైనా కంటే ఎక్కువ. చైనాలో 511.4 టన్నుల విక్రయాలు జరిగాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ ఉన్నది. ప్రస్తుతం బంగారం ధరలు ఈ వారంలో పది గ్రాములకు రూ.88వేల గరిష్ఠానికి చేరాయి. 2024లో బంగారం ధరలు 21శాతం పెరిగాయి. ఈ ఏడాది కేవలం 45 రోజుల్లోనే బంగారం ధరలు 10శాతానికిపైగా పెరిగాయి. చైనీస్ న్యూ ఇయర్కు ముందు డిమాండ్ను చూశామని.. కానీ, ఇప్పుడు అధిక ధరల కారణంగా డిమాండ్ కనిపించడం లేదని ఓ చైనా వ్యాపారి పేర్కొన్నారు.
జనవరిలో దేశ వాణిజ్య లోటు 20.88 బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. ఇది 2024 డిసెంబర్లో 21.94 బిలియన్లుగా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. పెరుగుతున్న ధరల కారణంగా బంగారం దిగుమతులు తగ్గడం వల్ల మెరుగుదల ఉండవచ్చని అంచనా వేసింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా బంగారం ధరల పెరుగుదల మధ్య డిమాండ్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ధరల పెరుగుదల నేపథ్యంలో పసిడి కొనుగోళ్లు తగ్గాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ ముగిసినందున డిమాండ్ సైతం తగ్గింది. దాంతో వాణిజ్య లోటు తగ్గింది. అయితే, ముడి చమురు ధల పెరుగుదల కారణంగా వాణిజ్య లోటు స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ ముడి చమురు ధరలు డిసెంబర్లో బ్యారెల్కు 73.13 డాలర్ల నుంచి జనవరిలో 78.35 డాలర్లకు చేరింది. ఫలితంగా వాణిజ్య లోటుపై ప్రభావం చూపుతున్నది.