Aadhar-Passport | విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్.. ఆ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే వెరిఫికేషన్ తప్పనిసరి. అలాగే, ఆధార్ కార్డు పొందాలంటే పాస్పోర్ట్ తరహా వెరిఫికేషన్ తప్పనిసరి. అవును ఇది నిజం. కానీ భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) పెట్టిన నిబంధన కాదు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధన ఇది. ఉత్తరప్రదేశ్లో `ఆధార్` కార్డు కోసం నమోదు చేసుకోవాలంటే ముందు వెరిఫికేషన్ నిర్వహించాలి. ఈ సంగతి ఉడాయ్ లక్నో రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రశాంత్ కుమార్ సింగ్ వెల్లడించారు. `రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి డెమోగ్రఫిక్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తాం. ఈ ప్రక్రియ పాస్పోర్ట్ తరహా మాత్రమే` అని చెప్పారు.
`ప్రతి జిల్లాలోనూ ఆధార్ సేవా సెంటర్, సబ్ పోస్టాఫీజు, ప్రధాన పోస్టాఫీసుతోపాటు కొన్ని సెలెక్టెడ్ కేంద్రాల్లో మాత్రమే ఆధార్ నమోదు ఫెసిలిటీ లభ్యం` అని లెఫ్టినెంట్ కల్నల్ ప్రశాంత్ కుమార్ సింగ్ చెప్పారు. ఆధార్ నమోదు కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నసంబంధిత పౌరుల డెమోగ్రఫిక్ సమాచారాన్ని వెరిఫికేషన్ కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సర్వీస్ లేదా పోర్టల్ ద్వారా పంపిస్తారు. జిల్లా మేజిస్ట్రేట్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్, యూపీ ప్రభుత్వ ప్రణాళిక విభాగం అధికారులకు ఈ డేటా అందుబాటులో ఉంటుంది.
వెరిఫికేషన్ ప్రక్రియలో పేర్లు నమోదు చేసుకున్న పౌరుల ఆధార్ నమోదు దరఖాస్తులను ఆమోదించే లేదా తిరస్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాధికారులకు ఉంటుంది. దరఖాస్తుదారు సమర్పించిన పత్రాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నా, పొర్జరీ పత్రాలు సమర్పించినా, తప్పుడు ఆధారాలు సమర్పించినా యూపీ రాష్ట్ర ప్రభుత్వాధికారులు ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చి జీవిస్తున్న వారు ఆధార్ దరఖాస్తు కోసం వారి సొంత ప్రాంతానికి వెళ్లాల్సిందేనని లెఫ్టినెంట్ కల్నల్ ప్రశాంత్ కుమార్ సింగ్ చెప్పింది. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకోవాలంటే ఈ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం ఇదే తొలి సారి అన్నారు. 2010లో కేంద్రం ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభించింది. దీని బాధ్యతను భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్)కు అప్పగించింది.