Mukesh Ambani | న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద అంతకంతకు పెరుగుతున్నది. 2023లో ఆయన సంపద మరో 9.98 బిలియన్ డాలర్లు పెరిగినట్లు బ్లూంబర్గ్ తాజా నివేదికలో వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 9 శాతం లాభపడటంతో ముకేశ్ అంబానీ సంపద మరింత పెరగడానికి దోహదం చేసిందని తన నివేదికలో పేర్కొంది. 97.1 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ అంబానీ దేశీయ శ్రీమంతుడిగాను, ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మంది శ్రీమంతుల సంపద 1.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెరిగినట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది 1.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నది. వీరిలో ఎలాన్ మస్క్ అత్యధికంగా 95.4 బిలియన్ డాలర్ల సంపదను పోగేసుకున్నారు. 2022లో మాత్రం ఆయన 138 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన విషయం తెలిసిందే.
గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోయింది. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ అనుమానాలతో కంపెనీ షేర్లు కుప్పకూలాయి. దీంతో 2023లో ఆయన 37.3 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ 83.2 బిలియన్ డాలర్లతో దేశీయ రెండో సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో 21 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. మరోవైపు, డీ-మార్ట్ అధినేత రాధాకృష్ణ దామాని 187 మిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు.
హెచ్సీఎల్ టెక్నాలజీ ఫౌండర్ శివ్ నాడార్ 9.47 బిలియన్ డాలర్లు పెరిగి 34 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. హెచ్సీఎల్ షేరు ధర 41 శాతం పెరగడమే ఇందుకు కారణం. జిందాల్ గ్రూపు చైర్పర్సన్ సావిత్రి జిందాల్ సంపద కూడా 8.93 బిలియన్ డాలర్లు అందుకొని 24.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరోవైపు ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా సంపద 7.09 బిలియన్ డాలర్లు అధికం కాగా, సన్ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ 5.26 బిలియన్ డాలర్లు, ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ 3.62 బిలియన్ డాలర్లు పెరిగింది.