ముంబై, జనవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా ట్రేడింగ్ రెండోరోజూ మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేశారు. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వంటి హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫలితంగానే సూచీలకు పెద్ద ఎత్తున నష్టాలు తప్పలేదు.
నిజానికి ఉదయం మార్కెట్లు భారీ లాభాల్లోనే మొదలయ్యాయి.బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 561.13 పాయింట్లు లేదా 0.79 శాతం ఎగబాకగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 160.45 పాయింట్లు లేదా 0.74 శాతం ఎగిసింది. అయితే సమయం గడస్తున్నకొద్దీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల నుంచి అమ్మకాల వైపు మళ్లారు. ఈ పరిణామమే చివరకు పెను నష్టాలకు దారితీసింది.
సూచీలు 1.50 శాతం క్షీణతను మూటగట్టుకోవాల్సి వచ్చింది. సెన్సెక్స్ 1,053.10 పాయింట్లు లేదా 1.47 శాతం దిగజారి 71వేల స్థాయికి దిగువన 70,370.55 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 70,234.55 స్థాయికి పడిపోయింది. అలాగే అంతకుముందు 72,039.20 పాయింట్లను తాకగా, తీవ్ర ఒడిదొడుకులకు నిదర్శనంగా ఈ ట్రేడింగ్ తీరు నిలిచింది. ఇక నిఫ్టీ సైతం 330.15 పాయింట్లు లేదా 1.53 శాతం కోల్పోయి 21,241.65 వద్ద స్థిరపడింది.
చుట్టుముట్టిన భయాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఆయా సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు మదుపరులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కార్పొరేట్ల పెర్ఫార్మెన్స్పై నెలకొన్న ఆందోళనలు.. చాలా రంగాల్లోని కీలక షేర్లను అమ్మకాల ఒత్తిడిలోకి నెడుతున్నాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారిప్పుడు. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) కూడా ఈ కారణంతోనే పెట్టుబడుల ఉపసంహరణ దిశగా నడుస్తున్నట్టు వారు చెప్తున్నారు.
కాగా, మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. విదేశీ మదుపరులకు సంబంధించి ఓనర్షిప్ నిబంధనల్ని కఠినతరం చేస్తుందన్న అంచనాలు సైతం కొనుగోళ్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయంటున్నారు. విదేశీ బ్యాంకులు, ఓ వర్గం ఆఫ్షోర్ ఫండ్ మేనేజర్ల ఒత్తిడిని లెక్కచేయకుండా ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ను సెబీ అమల్లోకి తేనుందన్న ప్రచారం కూడా నష్టాలకు దారితీసినట్టు వినిపిస్తున్నాయి. వీటికి ఇండెక్స్ల టెక్నికల్ టెన్షన్లు, మిడిల్ ఈస్ట్, ఎర్ర సముద్రం ఉద్రిక్తతలు తోడయ్యాయన్న అభిప్రాయాన్ని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకింగ్ షేర్లు ఫట్
బ్యాంకింగ్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ విలువ గరిష్ఠంగా 6.13 శాతం దిగజారింది. ఎస్బీఐ 3.99 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.41 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.23 శాతం చొప్పున క్షీణించాయి. హిందుస్థాన్ యునిలివర్ షేర్ వాల్యూ సైతం 3.82 శాతం పడిపోయింది. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్ 2.95 శాతం, స్మాల్క్యాప్ 2.79 శాతం చొప్పున పతనమయ్యాయి. రంగాలవారీగా రియల్టీ, మెటల్, చమురు-గ్యాస్, ఎనర్జీ, కమోడిటీస్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు దిగజారాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, చైనా లాభాల్లో ముగియగా, జపాన్ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు మాత్రం లాభాల్లో ముగిశాయి.
కుప్పకూలిన జీ
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) షేర్లు మంగళవారం ట్రేడింగ్లో ఏకంగా 33 శాతం వరకు నష్టపోయాయి. జీతో 10 బిలియన్ డాలర్ల విలీన ప్రతిపాదనను జపాన్ దిగ్గజం సోనీ విరమించుకోవడమే ఇందుకు కారణమన్నట్టు ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, బీఎస్ఈలో 32.73 శాతం నష్టంతో రూ.155.90 వద్ద, ఎన్ఎస్ఈలో 30.47 శాతం పతనంతో రూ.160.90 వద్ద జీ షేర్ విలువ ఉన్నది. ఒకానొక దశలోనైతే 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. మరోవైపు ఈ దెబ్బతో జీ మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.7,285.53 కోట్లు హరించుకుపోయింది. ప్రస్తుతం బీఎస్ఈలో సంస్థ మార్కెట్ క్యాప్ రూ.14,974.50 కోట్లుగా ఉన్నది.
కరిగిపోయిన లక్షల కోట్లు
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో మదుపరుల సంపద కూడా అంతే స్థాయిలో కరిగిపోయింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్లో నమోదైన సంస్థల మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.8.50 లక్షల కోట్లు పతనమైంది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్యూఎల్ వంటి అగ్రశ్రేణి సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో నష్టాల తీవ్రత అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,65,97,915.97 కోట్ల వద్ద ఉన్నది. శనివారం మార్కెట్ ముగిసే సమయానికి ఇది రూ.3,74,48, 736.78 కోట్లుగా ఉన్నది. శనివారం కూడా సెన్సెక్స్ 260 పాయింట్లు క్షీణించిన విషయం తెలిసిందే. నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయింది.
నష్టాలకు కారణాలు
హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
ఎఫ్ఐఐలు వెనక్కి
లాభాల స్వీకరణలో మదుపరులు
సెబీ నిబంధనల కఠినతరంపై ఊహాగానాలు
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు