ముంబై, మే 26: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 178.2 పాయింట్లు లేదా 0.97 శాతం అందుకుని 18,499.35 వద్ద స్థిరపడింది. దీంతో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు రోజులు లాభాల్లో కొనసాగినైట్టెంది. మదుపరుల సంపద ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల్లో ఎగబాకింది. బీఎస్ఈలోని సంస్థల విలువ రూ.2.28 లక్షల కోట్లు పుంజుకుని రూ. 282.61 లక్షల కోట్లకు చేరింది. కాగా, వచ్చే వారం విడుదలయ్యే దేశ జీడీపీపై ఆశలు, ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల మధ్య మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేశారు.
ఐటీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ, మెటల్, కమోడిటీస్, హెల్త్కేర్ రంగాల సూచీలు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. ఐటీ షేర్లు అత్యధికంగా 1.34 శాతం లాభపడగా, ఆ తర్వాత రియల్టీ షేర్లు 1.31 శాతం పుంజుకున్నాయి. ఇక రిలయన్స్ షేర్ల విలువ గరిష్ఠంగా 2.79 శాతం పెరిగింది. సన్ ఫార్మా, హిందుస్థాన్ యునిలీవర్, హెచ్సీఎల్, విప్రో, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, టైటాన్ షేర్లూ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 0.82 శాతం, స్మాల్క్యాప్ 0.49 శాతం ఎగిశాయి. కాగా, నష్టపోయిన ప్రధాన రంగాల్లో యుటిలిటీస్, చమురు-గ్యాస్, పవర్ ఉండగా.. షేర్లలో భారతీ ఎయిర్టెల్, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా మార్కెట్లలో ప్రధానమైన దక్షిణ కొరియా, జపాన్, చైనా సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలో మాత్రం కీలకమైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. అయితే అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవటం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది.