Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే నడుస్తున్నాయి. నిజానికి జనవరి నుంచి సూచీలు తీవ్ర ఆటుపోట్లకే లోనవుతున్నాయి. స్థిరత్వం లోపించిందనే చెప్పాలి. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఇన్వెస్టర్లు ఊగిసలాటకు గురవుతున్నారు మరి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 628.15 పాయింట్లు లేదా 0.82 శాతం పతనమై 75,311. 06 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 133.35 పాయింట్లు లేదా 0.58 శాతం క్షీణించి 22,795.90 దగ్గర నిలిచింది. ఈ నెల 1న పార్లమెంట్లో ప్రకటించిన కేంద్ర బడ్జెట్, ఆ తర్వాత వచ్చిన ద్రవ్యసమీక్షలో అంచనాలు అందుకోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల కోతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న సుంకాలు.. మదుపరులను పెట్టుబడులకు దూరం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ట్రేడింగ్లో ఒడుదొడుకులకు ఆస్కారముందని మెజారిటీ నిపుణుల అంచనా. ఇక డాలర్తో పోల్చితే ఆల్టైమ్ కనిష్ఠాల వద్ద కదలాడుతున్న రూపాయి మారకం విలువ.. మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తూనే ఉన్నది. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమేనని చెప్పవచ్చు. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,300 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,100 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,000-23,200 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడుదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.