Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశ, విదేశీ అననుకూలతల మధ్య మదుపరులు పెట్టుబడులకు దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,822.46 పాయింట్లు లేదా 2.24 శాతం పడిపోయి 79,402.29 వద్ద ఆగింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 673.25 పాయింట్లు లేదా 2.70 శాతం పతనమై 24,180.80 దగ్గర ముగిసింది. ఈ క్రమంలో ఈ వారం కూడా అమ్మకాల ఒత్తిడికే అధిక అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను కార్పొరేట్ కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు మునుపటిలాగే మార్కెట్ ట్రేడింగ్ను ప్రభావితం చేయనున్నాయి. ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలు ఎప్పట్లాగే ఈసారీ భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,500-24,700 మధ్యకు వెళ్లవచ్చని చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.