న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలనే మిగిల్చింది. ముఖ్యంగా చిన్న షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు పెద్ద దెబ్బే తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) స్మాల్క్యాప్ సూచీ దాదాపు 6 శాతం పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటివి ప్రభావితం చేశాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మదుపరుల లాభాల స్వీకరణతో మిడ్క్యాప్, సెన్సెక్స్లకూ నష్టాలు తప్పలేదు. కాగా, దేశీయ మదుపరులు ఎక్కువగా స్మాల్, మిడ్క్యాప్ సూచీల్లోని షేర్లనే కొంటుంటారు. దీంతో వాటిల్లో పెట్టుబడుల ఉపసంహరణ.. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీరుకు, కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసానికి అద్దం పడుతున్నదన్న అభిప్రాయాలు మెజారిటీ మార్కెట్ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అలాగే అదానీ గ్రూప్ వ్యవహారంతో నష్టాల తీవ్రత మరింత పెరిగిందంటున్నారు.