IT Companies | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశీయ ఐటీ సంస్థలకు మళ్లీ నిరాశతప్పెటట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ దేశాల ఆర్థిక స్థితిగతులు అనిశ్చితిలో కొనసాగుతుండటం, టెక్నాలజీ డిమాండ్ పడిపోవడం, క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రాధాన్యతనివ్వడంతో ఐటీ సంస్థలు నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బలహీనమైన వృద్ధిని నమోదు చేసుకోనున్న ఐటీ కంపెనీలు..ద్వితీయార్థంలో మాత్రం తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి.
దేశీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ టెక్నాలజీ, క్యాప్ జెమినీలు సైతం తొలి ఆరు నెలల్లో మందకొడి వృద్ధిని నమో దు చేసుకోనుండగా..ద్వితీయార్థంలో రికవరీ బాట పట్టనున్నాయి. కానీ, మోతీలాల్ ఒశ్వాల్ మాత్రం..డిసెంబర్ త్రైమాసికం కంటే గత త్రైమాసికంలో మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉన్నదని పేర్కొంది. అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు కొనసాగుతుండటంతో ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని వెల్లడించింది. 2008-09లో ఐటీ రంగ వార్షిక వృద్ధి 4.9 శాతానికి పరిమితమైందని, ఇప్పటి వరకు ఇదే కనిష్ఠ స్థాయని మోతీలాల్ తన నివేదికలో వెల్లడించింది. కీలక రంగాలు బలహీనంగా ఉండటంతోపాటు బ్యాంకింగ్, ఆర్థిక, సేవలు, బీమా రంగాల్లో నెలకొన్న మందకొడి పరిస్థితులతో అంతర్జాతీయ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని తెలిపింది.