మార్కెట్ పల్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాన సూచీ నిఫ్టీ 590 పాయింట్ల రేంజ్లో ట్రేడైన తర్వాత చివరకు 303 పాయింట్లు లేదా 1.72 శాతం నష్టంతో ముగిసింది. ఆటో, ఎనర్జీ రంగాల సూచీలు మినహా మిగతా అన్ని రంగాల ఇండెక్స్లు నష్టాలకే పరిమితమయ్యాయి. గత వారం ప్రారంభ స్థాయిలోనే ముగింపు కూడా జరగడంతో నిఫ్టీ లాంగ్ షాడోలతో డోజీ క్యాండిల్ను ఏర్పాటు చేసింది. ఇలాంటి క్యాండిల్ గడిచిన మూడు వారాల్లో ఇది రెండోసారి. గురువారం నాటి కనీస స్థాయికి దిగువన ముగియడంతోపాటు దీర్ఘకాల ట్రెండ్ ఇండికేటర్ 200 రోజుల చలన సగటుకు దిగువనే ముగిసింది. దీనికితోడు గత వారం 50 రోజుల చలన సగటు 200 రోజుల సగటుకు దిగువన ముగియడంతో దీర్ఘకాల బేర్ మార్కెట్ సంకేతాలను ఇచ్చింది. దీంతో సోమవారం కనీసం 150-200 పాయింట్ల నష్టంతో (గ్యాప్డౌన్) ప్రారంభమైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇప్పటికే ఎస్జీఎక్స్ నిఫ్టీ 17,000 దరిదాపులకు పతనమై ముగిసింది. నాలుగు డిస్ట్రిబ్యూషన్ రోజులు నిఫ్టీ ఖాతాలో ఉన్నాయి. మరో ఒకట్రెండు రోజులు డిస్ట్రిబ్యూషన్ జరిగి 50 రోజుల చలన సగటుకు దిగువన ముగిస్తేచాలు డౌన్ట్రెండ్ ధ్రువీకరణ అవుతుంది. ఇటీవలి 18,114 స్థాయిని అధిగమిస్తేనే మళ్లీ అప్ట్రెండ్లోకి మార్కెట్ ప్రవేశిస్తుంది. ఈ వారం 17,000 స్థాయికి దిగువన ముగిస్తే తక్షణ మద్దతు స్థాయి 17,893 వద్ద ఉన్నది. మూమెంటమ్ ఇండికేటర్ ఎంఏసీడీ మూడు వారాలుగా బుల్లిష్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నది. దీనికితోడు వీక్లీ ఆర్ఎస్ఐ 50 స్థాయికి దిగువన ముగిసింది. ఈ సంకేతాలు మార్కెట్కు ఏమాత్రం మంచివి కావు. కాబట్టి ఈ వారానికి కొత్త కొనుగోళ్లకు దూరంగా ఉండటమే ఉత్తమమైన వ్యూహం.
ఈ వారం బ్యాంకులు, ఆర్థిక సేవలు, మీడియా రంగాలు బలహీనంగా ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా రంగాల షేర్లు పాజిటివ్గా ట్రేడ్ కావచ్చు. అంచనా వేసినట్టుగానే గత వారం అదాని గ్రూప్ షేర్లు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఈ వారంలో కోల్ ఇండియా, మహీంద్రా హాలీడేస్, ఈఐడీ ప్యారీ, గుజరాత్ ఆల్కలీస్ షేర్లు వెలుగులో ఉంటాయి.