న్యూఢిల్లీ : భారత్పే డేటా చౌర్యానికి పాల్పడుతోందని కంపెనీ సహవ్యవస్ధాపకుడు, మాజీ సీఈఓ అష్నీర్ గ్రోవర్ ఆరోపించారు. భారత్పే ప్రస్తుత సీఈఓ భవిక్ కొలదియ అధికార దుర్వినియోగానికి పాల్పడి దేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యానికి తెగబడ్డారని గ్రోవర్ సంచలన ఆరోపణలు చేశారు. భవిక్ నిర్వాకంతో 15 కోట్ల మంది భారత్పే యూజర్ల సమాచార గోప్యతకు భంగం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.
డేటా ఉల్లంఘనతో 15 కోట్ల మంది భారత్పే యూజర్ల డేటా గోప్యత భగ్నమైందని ఆరోపిస్తూ గ్రోవర్ ఎన్పీసీఐకి లేఖ రాశారు. భారత్పేలో భవిక్కు అవకాశం ఇవ్వడం పొరపాటని, దీంతో దేశంలోనే అతిపెద్ద డేటా చోరీకి పాల్పడ్డాడని లేఖలో ఆరోపించారు. క్రెడిట్ కార్డ్ మోసంలో అమెరికాలో భవిక్ గతంలో దోషిగా తేలాడని, 18 నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచిన అనంతరం అతడిని భారత్కు తరలించారని గుర్తుచేశారు.
భారత్లోనూ నకిలీ టికెట్పై గుజరాత్కు వెళ్లేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలపై అతడికి వ్యతిరేకంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలను అందచేస్తున్నానని ఎన్పీసీఐకి పంపిన మెయిల్లో గ్రోవర్ పేర్కొన్నారు. ఇక భారత్పేలో డేటా చౌర్యం ఆరోపణలను కంపెనీ తోసిపుచ్చింది. కంపెనీ నుంచి తొలగించినందుకు గ్రోవర్ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని భారత్పే సీఈఓ భవిక్ కొలదియ పేర్కొన్నారు.