నెల రోజుల్లో 3 శాతం పతనం.. ఈ ఏడాదిలో 6.5 శాతం
ముంబై, జూలై 14: డాలరు మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి 80కి పడిపోయింది. గురువారం రాత్రి ఈ కరెన్సీ ఆఫ్షోర్ మార్కెట్లో 80.22 కనిష్ఠాన్ని తాకింది. అయతే ఇదే రోజున ముంబైలోని ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో 79.99 వద్ద ముగిసింది. క్రితం రోజుతో పోలిస్తే 18 పైసలు నష్టపోయింది. రూపాయి పతనంకావడం వరుసగా ఇది ఐదో రోజుకాగా, గత నెలరోజుల్లో 78 స్థాయి నుంచి భారీగా 3 శాతం రూపాయి విలువను నష్టపోయింది.
ఈ ఏడాది 6.5 శాతం విలువను కోల్పోయింది. అమెరికా డాలర్ను విక్రయించేందుకు ఎస్బీఐ తదితర ప్రధాన బ్యాంక్లు ఇప్పటికే 80కిపైగా కోట్ చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలరు పటిష్ఠంగా ఉండటంతో రూపాయి బలహీనపడిందని, క్రూడ్ ధరలు కొంతమేర దిగిరావడం రూపాయి నష్టాల్ని పరిమితం చేశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో అమెరికా కరెన్సీ బలాన్ని తెలిపే డాలర్ ఇండెక్స్ రికార్డు గరిష్ఠస్థాయి 109 సమీపంలో ట్రేడవుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 4.5 శాతం మేర క్షీణించి 95 డాలర్ల స్థాయికి తగ్గింది. మరోవైపు దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజూ తగ్గడం సైతం రూపాయిపై ప్రభావం చూపించింది.
మాంద్యం భయాలు:
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ఆర్థిక మాంద్యం ఆవరిస్తుందన్న భయాలతో భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి డాలర్లు మరింతగా తరలివెళతాయంటూ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిగుమతులకు డాలర్ చెల్లింపుల సామర్థ్యం తగ్గుతుందన్న అంచనాలు రూపాయిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచించే జాబ్లెస్ క్లెయిములు తాజాగా 8 నెలల గరిష్టస్థాయికి పెరిగినట్టు గురువారం గణాంకాలు వెలువడ్డాయి. ఈ ప్రభావంతో ఆఫ్షోర్ మార్కెట్లో రూపాయి విలువ 80.20 స్థాయికి పడిపోయింది.
అమెరికా రేట్ల పెంపు అంచనాలు
అమెరికాలో జూన్ నెలకు ద్రవ్యోల్బణం 41 సంవత్సరాల గరిష్ఠస్థాయి 9.1 శాతానికి పెరగడంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీ పెంచుతుందన్న అంచనాలతో ఇతర దేశాల నుంచి డాలర్ నిధులు అమెరికాకు వేగంగా తరలివెళుతున్నాయి. దీంతో డాలర్ బలపడి, భారత్తో సహా పలుదేశాల కరెన్సీలు పతనమవుతున్నాయి. ఈ నెలలో జరిగే సమీక్షలో వడ్డీ రేట్లను ఫెడ్ 0.75 శాతం పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి.
పెరుగుతున్న లోట్లు
జూన్ నెలలో వాణిజ్య ఖాతా లోటు రికార్డుస్థాయిలో 26 బిలియన్ డాలర్లకు పెరిగిందన్న వార్త రూపాయిని బెంబేలెత్తించింది. ఎగుమతులకంటే దిగుమతులు భారీస్థాయిలో పెరగడంతో దేశం డాలర్లను అధికంగా చెల్లించాల్సి వస్తున్నది. రూపాయి తగ్గడానికి ఇదీ ఒక కారణమే. మరోవైపు దేశంలోకి వచ్చి, పోయే విదేశీ కరెన్సీని నమోదు చేసే కరెంట్ ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరగవచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసిన నెలవారీ నివేదికలో పేర్కొనడం సైతం రూపాయిని బలహీనపర్చింది. కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది 3 శాతానికి పెరుగుతుందన్న అంచనాలున్నాయి.
పతన దిశగానే..
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచే అవకాశాలున్నందున డాలర్ బలోపేతమై, రూపాయి పడిపోతున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు. రూపాయి విలువ 80 స్థాయిని దాటితే కొద్ది రోజుల్లో 80.90 వరకూ పడిపోయే అవకాశం ఉందని, 78.80-78.50 మధ్యలో మద్దతు ఉందని పర్మార్ తన అంచనాల్ని వెల్లడించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం 9 శాతం దాటడంతో ఫెడ్ 75 బేసిస్ పాయింట్లకంటే ఎక్కువగానే వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయని, దాంతో రూపాయి క్షీణిస్తున్నదని మోతీలాల్ ఓస్వాల్ ఫారెక్స్ అనలిస్ట్ గౌరంగ్ సోమయ్య చెప్పారు. స్వల్పకాలంలో డాలర్/రూపాయి స్పాట్ విలువ 79.40-80 మధ్య ట్రేడ్ కావొచ్చన్నారు.
వినియోగదారులకు ధరల పోటు
సామాన్యుడిపై రూపాయి పిడుగు పడబోతున్నది. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుడిని కరెన్సీ మరింత కుంగదీయనున్నది. రూపాయి వేగంగా పతనంకావడంతో దేశంలో ధరలు ఎగసి వినియోగదారులపై పెను భారం పడుతుంది. దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సినందున, ముడి చమురు, బంగారం, వంటనూనెలు, పప్పు దినుసులు తదితరాల ధరలు పెరుగుతాయి. ఎలక్ట్రానిక్స్ పరికరాలతోపాటు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు కోసం అధికంగా వెచ్చించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉన్నది.
విదేశీ విద్య మరింత ఖరీదు
విదేశాల్లో విద్యనభ్యసించేవారికి మరింత వ్యయపర్చాల్సి వస్తుంది. వర్సిటీల్లో ఫీజుకు లేదా అక్కడ జీవన వ్యయం కోసం డాలర్లలోకి మార్చుకునేందుకు ఎక్కువ రూపాయిలు అవసరమవుతాయి.