Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): హిండెన్బర్గ్ ఆరోపణలతో అతలాకుతలమైన అదానీ గ్రూప్ తొలిసారిగా ఓ ఇన్ఫ్రా కంపెనీ టేకోవర్కు సిద్ధమైంది. గుజరాత్లో సిమెంట్ ప్లాంట్ నడుపుతున్న సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన సంఘీ సిమెంట్లోని మెజారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్టు అదానీ గ్రూప్ ఇటీవల ప్రకటించింది. ఈ లావాదేవీ కోసం సంఘీ ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజ్ విలువను రూ. 5,000 కోట్లుగా లెక్కించినట్టు అదానీ గ్రూప్ తెలిపింది. అయితే, సంఘీ సిమెంట్ను అదానీ గ్రూప్ చేజిక్కించుకోవడం వెనుక కుట్ర దాగి ఉన్నట్టు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టేకోవర్ ప్రక్రియలో ఓ పోటీసంస్థను బెదిరింపులకు గురిచేసి ఈ డీల్ను పూర్తికానిచ్చినట్టు ఆరోపిస్తున్నారు. దీనికోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసినట్టు మండిపడుతున్నారు.
సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో 40-70 శాతం వాటా కొనుగోలు చేయడానికి కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ సిమెంట్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీని కోసం ఏప్రిల్లో బిడ్లు కూడా దాఖలు చేసింది. అయితే, గత జూన్లో శ్రీ సిమెంట్కు చెందిన కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏమైందో ఏమో.. సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలు రేసు నుంచి తప్పుకొంటున్నట్టు జూలైలో శ్రీ సిమెంట్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఈ డీల్ను అదానీ గ్రూప్ తాజాగా పూర్తి చేసింది. దర్యాప్తు సంస్థల సాయంతో శ్రీ సిమెంట్ను రేసు నుంచి తప్పించి అదానీ గ్రూప్.. సంఘీ సిమెంట్ను చేజిక్కించుకొన్నట్టు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన రెండు ఉదంతాలను ఈ మేరకు ఉదహరిస్తున్నారు.
జీవీకే గ్రూప్ నిర్వహణలో ఉన్న ముంబై ఎయిర్పోర్ట్ను కూడా చివరకు అదానీ గ్రూప్ కైవసం చేసుకొన్నది. ముంబై ఎయిర్పోర్టులో జీవీకేకు 50.5 శాతం, దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్వెస్ట్హడ్ కంపెనీకి 13.5 శాతం వాటా ఉన్నది. ఒకవేళ బిడ్వెస్ట్హడ్ తన వాటాలను విక్రయించాలనుకొంటే తొలుత జీవీకేకు ఆఫర్ను ఇవ్వాలి. ఈ మేరకు ఆర్వోఎఫ్ఆర్ (రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్) క్లాజ్ను నిబంధనల్లో చేర్చారు. అయితే, అదానీ గ్రూప్ ఈ నిబంధనను తుంగలోతొక్కి, 2019లో బిడ్వెస్ట్హడ్ వాటాను చేజిక్కించుకొన్నది. దీంతో జీవీకే గ్రూప్ కోర్టులో కేసు వేసింది. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకొన్నది. ముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో రూ.705 కోట్ల అవకతవకలకు పాల్పడినట్టు 2020 జూన్లో సీబీఐ.. జీవీకే గ్రూప్పై కేసు నమోదు చేసింది. అయితే, ఎప్పుడైతే, ఈ ఎయిర్పోర్ట్ నిర్వహణలో ఉన్న తన 50.5 శాతం వాటాను అదానీ గ్రూప్నకు జీవీకే గ్రూప్ అప్పగించిందో.. సీబీఐ యూ-టర్న్ తీసుకొన్నది. ఈ కేసులో ఎలాంటి అవకతవకలు గుర్తించలేదంటూ కోర్టుకు తెలిపింది. జీవీకే గ్రూప్నకు ఒకవిధంగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఉదంతం వెనుక కేంద్రప్రభుత్వం ప్రమేయం ఉన్నదని, అదానీ గ్రూప్నకు ముంబై ఎయిర్పోర్టును అప్పగించడానికే జీవీకే గ్రూప్పై వేధింపుల పర్వం కొనసాగించిందంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇక, తమిళనాడులోని కరైకల్ పోర్ట్ విషయంలోనూ దాదాపుగా ఇలాగే జరిగింది. చెన్నైకి చెందిన మార్గ్ లిమిటెడ్ అనే కంపెనీకి కరైకల్ పోర్ట్లో 45 శాతం వాటా ఉండేది. అయితే, ఆ కంపెనీపై ఐటీ అధికారులు కేసులు నమోదుచేసి, సంస్థ ఎండీని 2017లో అరెస్టు చేశారు. అనంతరం, ఆ పోర్ట్ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది.