Railway Coach Factory | స్వరాష్ట్రంలో అడుగడుగునా అభివృద్ధికి ఆనవాళ్లే. యావత్తు దేశాన్ని అబ్బురపరిచేలా అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతి సాగుతున్నది.
భారత్లో అతిపెద్ద ప్రైవేట్ రంగ కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్రం వేదికైంది. సమైక్యాంధ్రప్రదేశ్లో సాధించని ఘనతకు ఇది సజీవ సాక్ష్యం. ఆది నుంచి ఒంటరి పోరుకే అలవాటుపడిన రాష్ట్ర ప్రభుత్వ కష్టానికీ ఇదో నిదర్శనం. ఓవైపు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే.. మరోవైపు వ్యాపార, పారిశ్రామిక రంగాల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం బాటలు వేసింది.
ఆ ఫలాలే ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కనిపిస్తుండగా, ఉద్యోగ- ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభావవంతమైన పాలసీలు.. దేశ, విదేశీ కార్పొరేట్లను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పరిశ్రమలే ఇందుకు తార్కాణం.
రంగారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్లను తెలంగాణ బిడ్డలు తయారు చేయడం గర్వకారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో మేధా సర్వో డ్రైవ్స్, స్విస్ రైల్వే వెహికిల్స్ తయారీదారు స్టాడ్లర్ రైల్ సంయుక్తంగా స్థాపించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఫార్మా పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయని, జీనోమ్ వ్యాలీలో మూడోవంతు వ్యాక్సినేషన్ ఇక్కడి నుంచే అందిస్తున్నామన్నారు. మేధా సంస్థ రూ.2,500 కోట్ల పెట్టుబడితో ఫేజ్-1ను మొదలుపెట్టి, మాన్యుఫ్యాక్చరింగ్ను కూడా ఆరంభించిందని చెప్పారు.
రానున్న రోజుల్లో ఈ ఫ్యాక్టరీ మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. మేధా సంస్థకు అనుబంధంగా మలేషియన్ కంపెనీతోపాటు మరో నాలుగైదు దేశాల కంపెనీలు కూడా విడిభాగాలను తయారు చేసే పనులు చేస్తున్నాయని పేర్కొన్నారు. పూరి రైల్వే కోచ్ ఇక్కడే తయారు చేసే నిమిత్తం మేధా సంస్థకు ముంబై మోనో రైల్ ప్రాజెక్టు రావడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో ట్రైన్ మొత్తం ఇక్కడే తయారు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని, ఇతర దేశాలకు సైతం ఎగుమతులు చేస్తామని మేధా సంస్థ చెప్తున్నదని, వారి ఆత్మవిశ్వాసాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం అన్నారు.
టీఎస్ ఐపాస్తో విప్లవాత్మక మార్పులు
ఎక్కడ ఏది ప్రగతిపథంలో నడువాలన్నా.. అందుకు తగిన వాతావరణం ఉండాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణ ప్రభు త్వం కఠిన నిర్ణయం తీసుకుని ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ను తెచ్చిందని గుర్తుచేశారు. దాదాపు 70-80 దేశాల్లోని విధానాలను పరిశీలించి తెచ్చిన టీఎస్ ఐపాస్తో పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో బిజినెస్ మీటింగుల్లో టీఎస్ ఐపాస్ గొప్ప సింగిల్ విండోగా ఎదగబోతోందని చెప్పేవాడినని, అది ఈరోజు రుజువు అవుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ఇది అమల్లోకి వచ్చాక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని పేర్కొన్నారు. ‘15 రోజుల్లోగా అన్ని అనుమతులిచ్చి స్పష్టత ఇవ్వకపోతే దరఖాస్తు ఆమోదం లభించినట్లేనని చెప్పాం. 16వ రోజు నుంచి ఆ దరఖాస్తు అమల్లోకి వస్తుందని, ఏ అధికారి దగ్గర ఫైల్ ఆగిపోయినా.. రోజుకు రూ.1,000 చొప్పున ఫైన్ విధించేలా విధానాలు రూపొందించాం’ అని సీఎం అన్నారు. ఇటువంటి చర్యల వల్ల పారిశ్రామిక ప్రగతి నమోదవుతున్నదని పేర్కొన్నారు.
మేధా గ్రూప్ ఎండీకి అభినందనలు..
‘ఫ్యాక్టరీ అంతా కలియతిరిగి మేధా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల నైపుణ్యాన్ని స్వయంగా చూశాను. ఇంతటి గొప్ప ఫలితాలను నేను ఊహించలేదు. అందరికీ హృదయపూర్వక అభినందనలు. వరంగల్ ముద్దు బిడ్డలు మేధా గ్రూప్ ఎండి కశ్యప్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డిలు ఇంత పెద్ద వెంచర్తో వందలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు శుభాభినందనలు. ఈ పరిశ్రమకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ పరిశ్రమ ఇంకా విస్తరించి రాష్ర్టానికి, దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.
– కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి
బీజేపీ, కాంగ్రెస్ దండగ : కేటీఆర్
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వకున్నా.. దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ తెచ్చుకున్నం.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా.. ‘మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ’ని సీఎం కేసీఅర్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించుకున్నం.. ఒక మాటలో చెప్పాలంటే.. ప్రజలకు ఎప్పుడూ అండగా బీఆర్ఎస్!! దేశానికి ఎప్పటికీ దండగ – బీజేపీ, కాంగ్రెస్!!!’ అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
స్వయంగా పరిశీలించిన సీఎం
కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. రోడ్డు మార్గంలో కొండకల్కు చేరుకున్నారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎలక్ట్రిక్ బగ్గీలో ఫ్యాక్టరీని మొత్తం కలియ తిరిగారు. ఫ్యాక్టరీలో చేపట్టిన పనులను, సాంకేతికతను సీఎం స్వయంగా పరిశీలించారు. అనంతరం మేధా సంస్థ ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎం పాల్గొని సంస్థ ప్రతినిధులను, ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎంపీలు డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకరెడ్డి, సంతోష్కుమార్, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, బాల్క సుమన్, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, శంబీపూర్ రాజు, జిల్లా కలెక్టర్ హరీశ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మేధా రైల్వేకోచ్ ఫ్యాక్టరి ఎండీ కశ్యప్రెడ్డి, ఈడీ శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీఓ ప్రభాకర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ళ కార్తీక్రెడ్డి, కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణలో పరిశ్రమలకు ప్రోత్సాహం
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నది. సీఎం కేసీఆర్ గత తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, విద్యుత్తు సరఫరా, పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులతో తెలంగాణలో ఎంతో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారాలతోనే అనతికాలంలోనే ఫ్యాక్టరీని అందుబాటులోకి తేగలిగాం. భారతీయులు స్వదేశంలోనే ఉండి దేశాభివృద్ధి కోసం పాటుపడాలన్నది నా సంకల్పం. మా సంస్థలో 800మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు. కొండకల్ ప్రాంతంలోని యువతలోనూ సాంకేతిక నైపుణ్యం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
-కశ్యప్రెడ్డి, మేధా సంస్థ ఎండీ