Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ప్రారంభంలో వచ్చిన లాభాలు ఆవిరయ్యాయి. ఉదయం సెనెక్స్ 72,269.12 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కొంత సేపు లాభాల్లో కొనసాగిన సెన్సెక్స్ అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 71,602.14 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 72,385.93 పాయింట్ల వరకు పెరిగింది.
చివరకు 354.21 పాయింట్లు పతనమై 71,731.42 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82.10 పాయింట్లు తగ్గి.. 21,771.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. దాదాపు 1,528 షేర్లు పురోగమించగా.. 1,858 షేర్లు పతనమయ్యాయి. 103 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో టాప్ లూజర్స్లో యూపీఎల్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. టాటా మోటార్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్, సన్ ఫార్మా, సిప్లా లాభపడ్డాయి.
రంగాలవారీగా చూస్తే, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ 0.3-0.9 శాతం వరకు తగ్గాయి. ఆటో, ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ ఒక్కొక్క శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ రంగ జీవిత సంస్థ సోమవారం కొత్త మైలురాయిని అందుకున్నది. పబ్లిక్ ఇష్యూ అనంతరం ఎల్ఐసీ షేరు తొలిసారిగా రూ.1000 మార్క్ను అందుకున్నది. ఓ దశలో 8.8శాతం పెరిగి రూ.1,028 గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 5.32శాతం లాభంతో రూ.995.75 వద్ద స్థిరపడింది.