న్యూఢిల్లీ: భారత్లో బ్యాంకింగ్ సేవల నుంచి సిటీ గ్రూప్ వైదొలగడం దేశీయ ఆర్థిక సంస్థలకు ఓ ఆకర్షణీయ అవకాశం కానున్నదని ఎకనమిస్ట్లు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న చిన్న బ్యాంకులకు మేలు చేస్తుందని అంటున్నారు.
సిటీ బ్యాంకును టేకోవర్ చేసిన సంస్థలకు ఆ బ్యాంక్ పోర్ట్ఫోలియో మెరుగైన ఖాతాదారుల పునాదిని అందిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వ్యాపారంలో సిటీ బ్యాంక్కు ప్రత్యేక స్థానం ఉందంటే అతిశయోక్తి కాదు.
సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లల్లో చాలా మంది ప్రీమియం, కార్పొరేట్ శాలరీ ఖాతాదారులే కావడం ఆసక్తికర పరిణామం. సిటీ బ్యాంకును కొనుగోలు చేయడానికి ఎస్బీఐ కార్డ్స్ , ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బడా బ్యాంకులు కూడా ముందుకు రావొచ్చంటున్నారు.
హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ కార్డ్ వంటి సంస్థలు ఇప్పటికే వాస్తవానికి సిటీ బ్యాంక్ మార్కెట్లో షేర్ని చేజిక్కించుకున్నాయి. పదేండ్ల క్రితం 20 శాతంగా ఉన్న సిటీ బ్యాంక్ మార్కెట్ షేర్ 4శాతానికి పరిమితమైంది.
అయితే, ఈ బ్యాంకు కార్డ్ పోర్టుఫోలియో మాత్రం పటిష్ఠంగా ఉంది. ఒక్కో కార్డుపై ఏటా ఖర్చు చేసే మొత్తంలో సిటీ బ్యాంకు 15-20 శాతం వృద్ధి నమోదు చేయడం గమనించ దగ్గ అంశం. ఇది ఈ బ్యాంకు ఖాతాదారుల ఖర్చు సామర్థ్యాన్ని తెలియజేస్తున్నది.
భారత్ సహా మొత్తం 13 దేశాల్లో రిటైల్ వ్యాపారం నుంచి నిష్క్రమించేందుకు అమెరికాకు చెందిన బ్యాంకింగ్ దిగ్గజం సిటీ బ్యాంక్ సిద్ధమైంది. సరైన కొనుగోలు దారు కోసం సిటీ బ్యాంక్ గ్రూప్ వెతుకుతున్నది. సంస్థ విక్రయం దాని విలువ, షరతులపై ఆధారపడి ఉంటుంది.
అయితే సిటీ బ్యాంకు మొత్తం రిటైల్ విభాగాన్ని ఒక్కటిగా విక్రయించకుండా.. ఒక్కో విభాగాన్ని వేర్వేరుగా విక్రయించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని విభాగాల్లో సిటీ బ్యాంకుకు మంచి పట్టు ఉంది. కనుక కొనుగోలుదారుతో బేరమాడే శక్తి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు.
తాము భారత మార్కెట్ నుంచి వైదొలిగినా ప్రస్తుత ఖాతాదారులు, ఉద్యోగులపై ఏమాత్రం ప్రభావం ఉండబోదని సిటీ గ్రూప్ స్పష్టం చేసింది. అవసరమైన నియంత్రణ అనుమతులు రాగానే విక్రయ ప్రక్రియ పూర్తి చేస్తామని సిటీ బ్యాంక్ ఇండియా సీఈఓ అషు ఖుల్లార్ తెలిపారు.
29 లక్షల మంది రిటైల్ ఖాతాదారులకు సిటీ బ్యాంక్ సేవలందిస్తున్నది. 35 శాఖల్లో 19వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 4,000 మంది వినియోగదారు బ్యాంకింగ్ విభాగంలో ఉన్నారు.
రిటైల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, గృహ రుణాలు, వెల్త్ మేనేజ్మెంట్ సేవలు నిర్వహించే ఈ సంస్థ నిష్క్రమణ భారత్లోని చిన్న బ్యాంకులకు ఓ అవకాశమని చెప్పక తప్పదు
టోరంటో కేంద్రంగా సిటీ బ్యాంక్ పని చేస్తున్నది. దీనికి వచ్చే వార్షిక లాభాల్లో భారత్లోని రిటైల్ వ్యాపారం ద్వారా వస్తున్నది చాలా తక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్లో సంస్థ ఆర్జించిన లాభాల్లో రిటైల్ విభాగం వాటా కేవలం 20 శాతం మాత్రమే.
అంతర్జాతీయంగా సంస్థ ఆస్తుల్లో భారత రిటైల్ విభాగం వాటా కేవలం 1.5 శాతమే. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యాపారం నుంచి బయటకు రావాలని సిటీ బ్యాంకు నిర్ణయించుకున్నది. అటుపై పూర్తిగా కార్పొరేట్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని సిటీ గ్రూప్ భావిస్తున్నది.