న్యూఢిల్లీ, జూన్ 22: కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. గత కొన్ని నెలలుగా భారీ వృద్ధిని నమోదు చేసుకున్న కీలక రంగాల్లో వృద్ధి ఏడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బొగ్గు, క్రూడాయిల్, రిఫైనరీ ఉత్పత్తుల్లో నిస్తేజం కారణంగా మే నెలకుగాను కేవలం 0.5 శాతం మాత్రమే వృద్దిని నమోదు చేసుకున్నది. కిందటేడాది ఇదే నెలలో నమోదైన 1.2 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైన 1.8 శాతం కంటే భారీగా పడిపోయింది.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన నివేదిక స్పష్టంచేసింది. బొగ్గు, క్రూడాయిల్, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు ఉత్పత్తిలో ప్రతికూలత నమోదైంది. వీటితోపాటు స్టీల్, సిమెంట్ రంగాలు కూడా నిరాశాజనక పనితీరు కనబరిచాయి. గత నెలలో స్టీల్ ఉత్పత్తి 5 శాతానికి పడిపోగా, సిమెంట్ ప్రొడక్షన్ కూడా 8.4 శాతానికి దిగొచ్చింది. 2025 ఏడాది మే నెలలో ఈ రెండు విభాగాలు 7.4 శాతం, 9.7 శాతం చొప్పున వృద్ధిని సాధించాయి. కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రం సానుకూలంగా నమోదైంది. ఈ విద్యుత్ ఉత్పత్తి 8.7 శాతం వృద్ధిని కనబరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో కీలక రంగాలు ఫ్లాట్గా నమోదయ్యాయి. ఈ రెండు నెలల్లో వృద్ధి 1.1 శాతంగా నమోదైంది. అక్టోబర్ 2025లో కనిష్ఠ స్థాయి మైనస్ 0.1 శాతం వృద్ధి నమోదైంది. ఒకవైపు దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని ఊదరగొడుతున్న నరేంద్ర మోదీ సర్కార్కు వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కీలక రంగాల్లో నిస్తేజం ఆవహరించగా..పారిశ్రామిక ప్రగతి కూడా అంతంత మాత్రంగానే నమోదైంది. ఎగుమతులు ఢీలా పడుతుండగా, దిగుమతులు మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే ఎగుమతులు పడిపోయాయని చెబుతున్న సర్కార్..ఆయా దేశాలకు ఎగుమతి అవుతున్నది సింగిల్ డిజిట్ మాత్రమే. దేశీయ ఎగుమతుల్లో అత్యధికంగా అమెరికా, యూరప్, అరబ్ దేశాలకు అవుతున్నాయి.
‘ఐదు రంగాలు నిరాశాజనక పనితీరు కనబరిచాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రిఫైనరీ ఉత్పత్తులతోపాటు ఇతర రంగాలు ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చలేదు. గత నాలుగేండ్లలో ఇదే భారీ పతనం కూడా. కానీ, ఇదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం 19 నెలల గరిష్ఠ స్థాయి 8.7 శాతానికి చేరుకోవడం మంచి పరిణామం. కీలక రంగాల్లో నిస్తేజం కారణంగా పారిశ్రామిక ప్రగతి 2-3 శాతం వరకు పతనం అయ్యే అవకాశాలున్నాయి.
– రాహుల్ అగర్వాల్, ఇక్రా లిమిటెడ్ ప్రధాన ఆర్థికవేత్త