Supreme Court On GST | దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఒకే పన్ను విధానం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన అవసరం లేదని జస్టిస్లు డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం గురువారం పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ కేవలం సలహా మండలి మాత్రమేనని తేల్చేసింది. జీఎస్టీపై చట్టాలను మార్చడానికి పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలకు సమాన హక్కులు ఉన్నాయని జస్టిస్లు చంద్రచూడ్, సూర్యకాంత్, విక్రం నాయుడులతో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది.
రాజ్యాంగంలోని 246ఏ అధికరణం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానం అని, పన్నుల విధానంపై పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు సమాన హక్కులు ఉన్నాయని పేర్కొన్నది. జీఎస్టీపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోద యోగ్యమైన, హేతుబద్దమైన పరిష్కార మార్గం చూపాలని సూచించింది. 279 అధికరణం ప్రకారం కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం స్వతంత్రం కాదని వ్యాఖ్యానించింది.
సముద్ర జలాల మీదుగా దిగుమతి చేసుకునే వస్తువులపై లెవీ రూపంలో ఐ-జీఎస్టీ విధించింది కేంద్రం. దీన్ని 2020లో గుజరాత్ హైకోర్టు కొట్టేయడంతో కేంద్రం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. కానీ గుజరాత్ హైకోర్టు తీర్పునే దేశ అత్యున్నత న్యాయస్థానం ధృవీకరించింది.
జీఎస్టీ చట్టం కింద కీలక విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటైందే జీఎస్టీ కౌన్సిల్. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం జీఎస్టీ ఖరారు చేయడం జీఎస్టీ కౌన్సిల్ బాధ్యత. జీఎస్టీ కౌన్సిల్కు కేంద్ర ఆర్థిక మంత్రి సారధ్యం వహిస్తారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. 2017 జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ చట్టం దేశంలో అమల్లోకి వచ్చింది.