కేసు నమోదు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ, జూలై 14: పరారీ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను రూ.55.27 కోట్లు మోసం చేశాడన్నదానిపై ఎఫ్ఐఆర్ దాఖలైనట్టు గురువారం అధికారులు తెలిపారు. అయితే నిరుడు ఆగస్టు 30న బ్యాంక్ ఫిర్యాదు చేయగా, దాదాపు ఏడాది తర్వాత కేసు నమోదు కావడం గమనార్హం.
చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్లో భాగమైన బెజెల్ జ్యుయెల్లరీ (డీడమాస్ జ్యుయెల్లరీ), దాని హోల్-టైం డైరెక్టర్లపై ఈ ఫిర్యాదున్నది. నిందితుల్లో చోక్సీతోపాటు మరో ముగ్గురున్నారు. బెజెల్ జ్యుయెల్లరీకి కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు రూ.30 కోట్లు, రూ.25 కోట్ల చొప్పున రుణాలిచ్చాయి. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.13వేల కోట్ల కుంభకోణంలో చోక్సీ కూడా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.