న్యూఢిల్లీ : కరోనా కేసుల పెరుగుదలతో ప్రభుత్వాలు కొవిడ్-19 నియంత్రణలను కఠినంగా అమలు చేయడంతో దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. గత 15 రోజులుగా వివిధ వ్యాపారాలు యాభై శాతం పైగా నష్టాలను ఎదుర్కొన్నాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) పేర్కొంది. వాణిజ్య, ఆర్ధిక కార్యకలాపాలకు ఆటంకం లేకుండా కరోనా కట్టడి చర్యలు చేపట్టాలని సీఏఐటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. వాణిజ్య కార్యకలాపాలకు విఘాతం కలగని రీతిలో వాణిజ్య, పరిశ్రమ సంఘాలతో సంప్రదింపులు చేపట్టిన మీదట ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని సీఏఐటీ అధికారులను కోరింది.
కరోనా కట్టడికి ఢిల్లీలో తీసుకున్న సరి-బేసి మోడల్ వంటి చర్యలు సానుకూల ఫలితాలు ఇవ్వలేదని ఇది వాణిజ్య కార్యకలాపాలను దెబ్బతీసిందని ట్రేడ్ బాడీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నియంత్రణలతో పాటు వారాంతపు లాక్డౌన్ దేశ రాజధానిలో వ్యాపారాన్ని దెబ్బతీశాయని పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి నియంత్రణలు అమ్మకాలను దెబ్బతీశాయని తెలిపింది.
ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో వ్యాపారులు సరుకుల కోసం ఢిల్లీ వస్తుంటారని, నియంత్రణల మూలంగా ఐదు లక్షల మంది వ్యాపారులు దేశ రాజధానికి రావడం నిలిపివేశారని సీఏఐటీ తెలిపింది. ట్రేడ్ హబ్గా ఢిల్లీ ఇమేజ్ను కరోనా నియంత్రణలు ప్రభావితం చేశాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు వినియోగదారులు సైతం అత్యవసరమైతేనే వస్తువలను కొనుగోలు చేస్తున్నారని, ఈ పరిస్థితి వ్యాపారాలను దెబ్బతీస్తోందని పేర్కొంది. వ్యాపార, వాణిజ్య పునరుద్దరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలని సీఏఐటీ విజ్ఞప్తి చేసింది.