BSNL – 4G Services | కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ `బీఎస్ఎన్ఎల్` యూజర్లకు తీపి కబురందించింది. వచ్చే ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా తన కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ `ఆత్మ నిర్భర్ భారత్` ఇన్షియేటివ్లో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీతో బీఎస్ఎన్ఎల్లో 4జీ సేవలు అందుబాటులోకి తెస్తున్నది. ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన ప్రయోగాత్మక ప్రాజెక్టులో 700 మెగా హెర్ట్జ్ – 2100 మెగా హెర్ట్జ్ మీద సెకన్కు 40-45 ఎంబీ స్పీడ్తో డేటా లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు వెల్లడించాయి.
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్తో కలిసి, కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థ `సీ-డాట్`.. అభివృద్ధి చేసిన దేశీయ టెక్నాలజీతో పంజాబ్లో ఇప్పటికే 4జీ సేవలను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చింది. సీ-డాట్ డెవలప్ చేసిన టెక్నాలజీ.. పంజాబ్లో మెరుగైన సేవలు అందిస్తున్నదని బీఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారులు చెప్పారు.
ఇక దేశమంతా 4జీ నెట్వర్క్ విస్తరణకు టీసీఎస్, తేజస్, ప్రభుత్వ రంగ `ఐటీఐ` కలిసి బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.19 వేల కోట్ల విలువైన ఆర్డర్ను పొందాయి. దేశవ్యాప్తంగా 1.12 లక్షల 4జీ, 5జీ టవర్లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేస్తున్నందున భవిష్యత్లో 4జీ నుంచి 5జీకి మారుతున్నప్పుడు వీటిని మళ్లీ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం రాదు. నాలుగేండ్లుగా తన కస్టమర్లకు 4జీ సేవలందించే సిమ్ కార్డులు విక్రయిస్తున్నది. 4జీ సిమ్లు కల వారు 5జీ సేవల కోసం కొత్త సిమ్ కార్డు తీసుకోవాల్సి ఉంటది.