ముంబై, డిసెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్రస్తుతేడాదిలో జీడీపీ వృద్ధి అంచనాను పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకింగ్, వడ్డీరేట్లకు సంబంధించిన షేర్లు కదంతొక్కాయి. దీంతో సూచీలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 303.91 పాయింట్లు అందుకొని నూతన గరిష్ఠ స్థాయి 69,825.60 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 69,894 పాయింట్లను తచ్చాడిన సూచీ త్వరలో 70 వేల మార్క్ను అధిగమించే అవకాశాలున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. అలాగే మరో సూచీ నిఫ్టీ సైతం 68.25 పాయింట్లు అందుకొని 20,969.40 వద్ద ముగిసింది.
దేశీయ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీ టాప్ గెయినర్గా నిలిచింది. కంపెనీ షేరు 2.69 శాతం లాభపడింది. దీంతోపాటు జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లు కూడా లాభాల్లో ముగిశాయి. కానీ, ఐటీసీ, మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ, టెక్, బ్యాంకింగ్ రంగ సూచీలు ఒక్క శాతం వరకు లాభపడగా, యుటిలిటీ, పవర్, ఎఫ్ఎంసీజీ, టెలి కమ్యూనికేషన్స్, ఆటో రంగ సూచీలు పడిపోయాయి.