ముంబై: ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగింది. ఒక శాతానికి పైగా లాభంతో సూచీలు ఒక నెల గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో ఆది నుంచి భారీ లాభాల్లో పయనించి లాభాలు మూటగట్టుకున్నాయి. దాంతో వరుసగా మూడోవారం భారత మార్కెట్లు లాభాలతో ముగిసినట్లయ్యింది.
గడిచిన వారాన్ని అమెరికా మార్కెట్లు లాభాలతో ముగించాయి. ఈరోజు ఏసియా పసిఫిక్ మార్కెట్లు కూడా లాభాలు గడించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మన మార్కెట్లు లాభాల్లోకి దూసుకుపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 786 పాయింట్ల భారీ లాభంతో (1.31 శాతం) 60,746 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 225 పాయింట్ల లాభంతో (1.27 శాతం) 18,012 వద్ద ముగిసింది.
ఆటో మొబైల్స్, ఐటీ, టెక్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ తదితర సూచీలు లాభాలను ఆర్జించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, మారుతి కంపెనీల షేర్లు లాభపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.