న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) మరో ఘనత సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ప్రభుత్వరంగ బ్యాంకుల రుణ వితరణలో బీవోఎంకు తొలి స్థానం వరించింది. రుణ వితరణతోపాటు బ్యాంక్ డిపాజిట్లలోనూ ఈ ఘనత సాధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీవోఎం స్థూల అడ్వాన్స్లు 27.10 శాతం పెరిగి రూ.1,40,561 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.
ఇదే సమయంలో మరో ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 16.43 శాతం, 15.43 శాతం వృద్ధితో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 13.66 శాతంతో నాలుగో స్థానం వరించింది. విలువ పరంగా చూస్తే బీవోఎం ఇచ్చిన రుణాల కంటే ఎస్బీఐ 17 రేట్లు అధికంగా రూ.24,50,821 కోట్లు రుణం ఇవ్వగా, ఐదు రెట్లు అధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.6,95,493 కోట్లు ఇచ్చింది.
బీవోఎం డిపాజిట్లలోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నది. గత త్రైమాసికంలో బ్యాంక్ డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1,95,909 కోట్లకు చేరుకున్నాయి. రెండో స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.42 శాతం వృద్ధితో రూ.9,92,517 కోట్లుగా ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా 8.51 శాతం పెరిగి రూ.9,09,095 కోట్లుగా నమోదైంది. గడిచిన త్రైమాసికంలో అత్యధిక పీఎస్బీలు లాభాలను ఆర్జించాయి. 12 పీఎస్బీల మొ త్తం లాభం రూ.15,306 కోట్లుగా ఉన్నది.