గురుగ్రామ్లో కొత్తగా స్టార్టప్ పెట్టాలనుకున్నా. అయితే, అనుమతులు, ట్యాక్స్ రూల్స్ పేరిట ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెట్టింది. దీంతో ఇక్కడ కుదరదని దుబాయికి వచ్చా.
– విశాల్ కౌస్తుభ, పారిశ్రామికవేత్త
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ వంటి అంశాల్లో గత ప్రభుత్వాల పాలనలో కంటే ప్రస్తుతం భారత్ మెరుగ్గా ఉంది.
– జూన్ 13న రోజ్గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
Millionaires | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన కోటీశ్వరులు భారత్ను వీడుతున్నారు. దేశంలో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తీసుకువస్తున్న కొత్త నిబంధనల పట్ల తీవ్ర అసంతృప్తితో మాతృదేశాన్ని వీడి విదేశాల బాట పడుతున్నారు. ఇలా ఎక్కువ మంది సంపన్నులు మాతృదేశాలను వీడుతున్న జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు-2023 పేర్కొన్నది. ఈ ఏడాది సుమారు 6,500 మంది అధిక సంపద కలిగిన వ్యక్తులు(హెచ్ఎన్డబ్ల్యూఐ) భారత్ను వీడి విదేశాలకు వెళ్లి స్థిరపడనున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. 10 లక్షల డాలర్లకు(దాదాపు రూ. 8.2 కోట్లు) మించి సంపద ఉన్న వారిని హెచ్ఎన్డబ్ల్యూఐగా పరిగణిస్తారు. వలస వెళుతున్న సంపన్నులు ఎక్కువగా దుబాయి, సింగపూర్లో స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నారు. అక్కడి ప్రభుత్వాలు ‘గోల్డెన్ వీసా’ వంటి విధానాలతో రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నాయి.
పన్నులకు సంబంధించి మన దేశంలో అమలు చేస్తున్న సంక్లిష్ఠమైన చట్టాలే ఎక్కువ మంది సంపన్నులు భారత్ను వీడి విదేశాల్లో స్థిరపడటానికి మొగ్గు చూపడానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గత రెండేండ్లుగా విదేశాల్లో చేసే చెల్లింపులకు సంబంధించి కేంద్రం కఠిన నిబంధనలు తెస్తుండటం మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు.
హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు-2023 ప్రకారం ఈ ఏడాది 6,500 మంది సంపన్నులు భారత్ను వీడనున్నారు. వీరంతా ఒక్కొక్కరు కనీసం రూ.8.2 కోట్లు పెట్టుబడి పెట్టగలిగిన వారు. అంటే, ఈ ఒక్క సంవత్సరమే మన దేశం కనీసం రూ.53 వేల కోట్ల సంపదను కోల్పోతున్నది. గత ఏడాది ప్రకటించిన ఇదే నివేదిక ప్రకారం 7,500 మంది సంపన్నులు భారత్ను వీడారు. ఈ లెక్కన కనీసం రూ.61 వేల కోట్ల పెట్టుబడి పెట్టగలిగిన వారు దేశాన్ని వీడారు. వీరు దేశాన్ని వీడకుండా ఉండి ఈ సంపదను దేశంలోనే పెట్టుబడులుగా పెడితే వేలాది కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండేది. దేశ ఆర్థిక ప్రగతికి వీరి సంపద దోహదపడేది. సంపన్నుల వలసలను నివారించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు శూన్యం. సంపన్నులు దేశాన్ని వీడకుండా సంక్లిష్ఠమైన పన్ను, ఆర్థిక విధానాల స్థానంలో సులభతర విధానాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.