Stocks | కీలక వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లకు రుచించలేదు. అందువల్లే గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 724 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 21,750 పాయింట్ల దిగువన స్థిర పడింది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ఒక శాతం తగ్గి 71,428 పాయింట్లు, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 212 పాయింట్లు (0.97 శాతం) పతనంతో 21,718 పాయింట్ల ముగిసింది.
ఫలితంగా ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్ట్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్ భారీగా 3-4 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు ఎస్బీఐ, పవర్ గ్రిడ్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలతో ముగిశాయి. అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.82.95 వద్ద కొనసాగుతున్నది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 79.35 డాలర్లు పలుకుతున్నది.
ఇక నిరంతరం నిబంధనలను ఉల్లంఘించినందు వల్లే పేటీఎంపై ఆంక్షలు విధించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించడంతో ఆ సంస్థ షేర్ గురువారం 10 శాతం పతనంతో మరో దఫా లోయర్ సర్క్యూట్ను తాకింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, రియాల్టీ, ఆటో ఇండెక్స్ లు నష్టపోగా, నిఫ్టీ ఐటీ, మీడియా, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ లు లాభాలతో ముగిశాయి.
గురువారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 72,473.42 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైనా.. ఆర్బీఐ నిర్ణయం వెలువడగానే నష్టాల్లో కూరుకున్నది. అంతర్గత ట్రేడింగ్ లో ఒకానొక దశలో 900 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ 71,230.62 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 723.57 పాయింట్ల పతనంతో 71,428.43 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 212.55 పాయింట్ల పతనంతో 21,717.95 పాయింట్ల వద్ద స్థిర పడింది.