న్యూఢిల్లీ, నవంబర్ 10: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు మరోసారి షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెరిగిన వడ్డీరేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో రుణరేటు 8.05 శాతానికి చేరుకున్నది.
బ్యాంక్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో వ్యక్తిగత, వాహన, గృహ రుణాలు మరింత అధికమవనున్నాయి. అలాగే ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 7.10 శాతం నుంచి 7.25 శాతానికి పెరిగింది. నెల, మూడు, ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో రుణరేటు వరుసగా 7.70 శాతానికి, 7.75 శాతానికి, 7.90 శాతానికి చేరుకున్నాయి.