న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. ఇష్యూ ధర కంటే 29 శాతం అధికంగా ముగిసింది. రూ.710 ధరతో ప్రవేశించిన షేరు ఇంట్రాడేలో 38.83 శాతం వరకు పెరిగింది. చివర్లో రూ.677.10 వద్ద ముగిసింది. ఇష్యూ ధర రూ.524 కంటే ఇది 29 శాతం అధికం. అటు ఎన్ఎస్ఈలోనూ 37.40 శాతం లాభపడిన షేరు చివరకు 28.48 శాతం అందుకొని రూ. 673.25 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.4,002 కోట్లుగా నమోదైంది.
బీఎస్ఈలో 7.80 లక్షల కంపెనీ షేర్లు చేతులు మారగా.. అటు ఎన్ఎస్ఈలో 1.51 కోట్ల షేర్లలో ట్రేడింగ్ జరిగింది. ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన రావడంతో 80.60 రెట్ల అధిక బిడ్డింగ్లు వచ్చాయి. ఈ ఐపీవోల్లో భాగంగా తాజా షేర్లను జారీ చేయడంతో రూ.240 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మరో రూ.500 కోట్లు సమీకరించింది.