Unclaimed Asset | ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఉన్న నగదు బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద రూ.1.84లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సదరు మొత్తం అర్హులకు అందేలా అధికారులు చూడాలన్నారు. కేంద్రమంత్రి గుజరాత్ గాంధీనగర్లో మూడులల పాటు జరిగే ‘మీ సొమ్ము-మీ హక్కు’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. గుజరాత్ ఆర్థిక మంత్రి కనుభాయ్ దేశాయ్, బ్యాంకులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవగాహన, ప్రచారం, యాక్షన్ అనే మూడు అంశాలపై పని చేయాలని.. అప్పుడు అన్క్లెయిమ్ సొమ్ము సరైన లబ్ధిదారులకు చేరుతాయన్నారు. బ్యాంకు డిపాజిట్లు, బీమా, ప్రావిడెండ్ ఫండ్, షేర్లు తదితర రూపాల్లో బ్యాంకులు, ఇతర నియంత్రణ సంస్థల వద్ద రూ.1.84 లక్షల కోట్ల నిధులు మూలుగుతున్నాయన్న ఆర్థిక మంత్రి.. మొత్తాన్ని మూడునెలల్లో అర్హులకు చేరేలా అధికారులే చొరవ చూపాలన్నారు.
మొత్తం భద్రంగా ఉందని, సరైన పత్రాలు పత్రాలు అందించి నగదును తీసుకోవాలని ఆమె పౌరులకు సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం కస్టోడియన్గా వ్యవహరిస్తుందన్నారు. క్లెయిమ్ కాని నిధులు బ్యాంకులు, ఆర్బీఐ, ఐఈపీఎఫ్లో ఉన్నాయని.. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత తిరిగి వాటిని పొందవచ్చన్నారు. దీర్ఘకాలంలో నగదును ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీ అవుతుంటాయన్నారు. బ్యాంకుల నుంచి ఆర్బీఐకి, సెబీ నుంచి మరో సంస్థకు ఇలా నగదు మారుతూ ఉంటుందన్నారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల రిజర్వ్ బ్యాంక్ ఉద్గమ్ (UDGAM) పోర్టల్ను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. పోర్టల్ ద్వారా పౌరులు నగదును క్లెయిమ్ చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు. అవసరమైతే బ్యాంకులు గ్రామాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయాలని నిర్మలా సీతారామన్ సూచించారు. అయితే, క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల అర్హులను గుర్తించేందుకు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తారని గుజరాత్ గ్రామీణ బ్యాంకు తెలుపగా.. బ్యాంకును ఆర్థికమంత్రి ప్రశంసించారు.