Gold Rate | న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైం హై రికార్డుకు చేరాయి. శుక్రవారం హైదరాబాద్లో తులం 24 క్యారెట్ పసిడి విలువ రూ.61,800లను తాకింది. గురువారంతో పోల్చితే రూ.600 ఎగబాకడం గమనార్హం. 22 క్యారెట్ పుత్తడి (నగల బంగారం) 10 గ్రాముల రేటు కూడా రూ.550 ఎగిసి రూ.56,650 పలికింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.480 పుంజుకొని రూ.61,780గా ఉన్నది.
వెండి ధరలూ పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్లో 4 రోజుల్లో కిలో రూ.3,000 పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1,200 పుంజుకున్నది. దీంతో కిలో వెండి ధర రూ.83,000లుగా ఉన్నది. అయితే ఢిల్లీలో మాత్రం రూ.77, 580 గా ఉన్నది. కాగా, సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమల నుంచి వస్తున్న డిమాండ్తో ధరలు పెరుగుతూపోతున్నాయని మార్కెట్ వర్గాలు తాజా ట్రెండ్ను విశ్లేషిస్తున్నాయి.
ఐదేండ్ల క్రితం జారీఅయిన సావరిన్ గోల్డ్ బాండ్ను ముందస్తుగా విత్డ్రా చేసుకునేవారి కోసం రిజర్వ్బ్యాంక్ తాజాగా ధరను నిర్ణయించింది. ఇది జారీ ధరకంటే రెట్టింపుపైగానే ఉంది. 2017-18లో గోల్డ్ బాండ్ సిరీస్ 3 గ్రాముకు రూ.2,964 ధరతో జారీకాగా, దానిని ఈ ఏప్రిల్ 15తో ఐదేండ్లు పూర్తవుతుంది. ఈ బాండ్ను రూ.6,063 ధరకు అప్పగించి, డబ్బు పొందవచ్చని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించిన మూడు పనిదినాల బంగారం ధర (ఏప్రిల్ 11 నుంచి 13 వరకూ) ఆధారంగా ఈ బాండ్ విత్డ్రాయిల్ ధరను నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇది పెట్టిన పెట్టుబడిని ముందస్తుగా మదుపరులు వెనక్కు తీసుకోవాలని భావిస్తే, దీని ద్వారా వడ్డీ కాకుండా 105 శాతం రాబడి వచ్చినట్టు అవుతుంది. వాస్తవానికి 8 ఏండ్ల కాలపరిమితితో గోల్డ్ బాండ్స్ జారీ అవుతుండగా, ఐదేండ్ల తర్వాత ముందస్తు రిడంప్షన్కు అనుమతిస్తారు. ఈ విత్డ్రాయిల్ కోసం మదుపరులు సంబంధిత బ్యాంక్ శాఖ, షిల్ కార్యాలయం, పోస్టాఫీసు, ఏజెంట్లను సంప్రదిస్తేనే ముందస్తు రిడంప్షన్ను అంగీకరిస్తామని ఆర్బీఐ తెలిపింది. నగదును కస్టమర్ బ్యాంక్ ఖాతాలో జమచేయనున్నట్టు తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్కు 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుండగా, వడ్డీని ప్రతీ ఏటా బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు. ఈ బాండ్ వడ్డీపై పన్ను ఉంటుంది. కానీ బాండ్ రిడంప్షన్ ద్వారా వచ్చే సొమ్ముకు మూలధన లాభాల పన్ను మినహాయింపు ఉంది.
రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు శనివారం భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం రాత్రి ఔన్స్ గోల్డ్ ధర 2,013 డాలర్లకు పడిపోవడం ఇందుకు కారణం. దీంతో మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ల్లో తులం పుత్తడి ధర రూ.1,000 తగ్గడంతో శనివారం స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావచ్చునని బులియన్ ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. డాలర్కు అనూహ్యంగా మద్దతు లభించడంతో బంగారం ధరలు పడిపోయాయి. మరోవైపు, అమెరికాలో మాంద్యం వస్తున్నదన్న భయాలు, ఆయా దేశాల స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకుల మధ్య మదుపరులు అతి సురక్షితమైన బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయింది.