HomeLoan Costly | కరోనాతో స్తంభించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ 2020 నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ వచ్చింది. గత మే మొదటి వారం వరకు రెపోరేట్ నాలుగు శాతం. కానీ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం దరిమిలా ధరలు పైపైకి దూసుకెళ్లాయి. ముడి చమురు మొదలు కూరగాయల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో గత నెల రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచేసింది ఆర్బీఐ. తదనుగుణంగా ప్రధాన బ్యాంకులన్నీ కీలక వడ్డీరేట్లు పెంచేయడంతో వివిధ రుణాలు తీసుకున్న వారిపై భారం పడింది. ప్రత్యేకించి ఫ్లోటింగ్ వడ్డీరేట్లపై ఇండ్ల రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లింపు పెంపు లేదా.. రుణ చెల్లింపు గడువు పెంచుతూ సంబంధిత బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు నిర్ణయాలు తీసేసుకున్నాయి.
తాజాగా సోమవారం నుంచి ఆర్బీఐ ద్వైవార్షిక ద్రవ్యపరపతి సమీక్ష జరుగనున్నది. వివిధ వస్తువుల ధరలు భగభగ మండుతున్న నేపథ్యంలో మరో దఫా ఆర్బీఐ రెపోరేట్ పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక వేత్తలు, వివిధ బ్యాంకుల నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న ధరలను దృష్టి పెట్టుకుంటే మరో దఫా రెపోరేట్ పెంచవచ్చునని గత భేటీలోనే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలిచ్చారు. కనుక బుధవారం రెపోరేటు మరో 40 బేసిక్ పాయింట్లు పెంచొచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెపోరేట్ 100 బేసిక్ పాయింట్లు పెరిగి 2023 మార్చి నాటికి కీలక రెపోరేట్ 5.15 శాతం కావచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనుక ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు ఫ్లోటింగ్ వడ్డీరేట్లకు అంగీకరిస్తే రుణ వాయిదా భారం పెరుగుతుంది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి నెలవారీ రుణ వాయిదా భారం అవుతుందని అంటున్నారు.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్) 50 బేసిక్ పాయింట్లు పెంచి, బ్యాంకులకు నిధుల లభ్యత తగ్గిస్తే ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని ఆర్థికవేత్తలంటున్నారు. గత సమీక్షలో 50 బేసిక్ పాయింట్లు తగ్గించడం వల్ల బ్యాంకులకు సుమారు రూ.87 వేల కోట్ల నిధుల రాబడి తగ్గింది. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ అంచనాలను మించిపోయి ఆరు శాతంగా నమోదైంది. కేంద్రం కూడా ధరలను నియంత్రించడానికి లీటర్ పెట్రోల్పై రూ.8, లీటర్ డీజిల్పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గించింది. ప్లాస్టిక్, స్టీల్ ధరలను తగ్గించడానికి కస్టమ్స్ డ్యూటీని కేంద్రం కుదించింది.