Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొంటున్న ఏకపక్ష విధాన నిర్ణయాలు కార్పొరేట్లకు జేబులు నింపేందుకే కాకుండా అటవీభూములనూ దోచిపెట్టేలా ఉన్నాయి. దేశంలోనే అత్యంత విస్తారమైన అడవుల్లో ఒకటైన ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ అరండోలో నిక్షిప్తమై ఉన్న అపార బొగ్గు నిల్వలను ఇప్పటికే చేజిక్కించుకొన్న అదానీ గ్రూప్ కన్ను అక్కడి వందల కోట్ల రూపాయల విలువైన అటవీ భూముల మీద పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆప్తమిత్రుడికి లబ్ధి చేకూర్చడానికి నిబంధనలు గాలికొదిలేసిన కేంద్ర సర్కార్.. ఆ అటవీ భూములనూ కట్టబెట్టినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్ ‘ది స్క్రోల్’ ఓ కథనాన్ని వెలువరించింది.
ఉత్తర ఛత్తీస్గఢ్లోని 1,800 చదరపు కిలోమీటర్ల పరిధిలో హస్దేవ్ అరండో అభయారణ్యం విస్తరించి ఉన్నది. ఈ అటవీ భూముల్లో 500 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు అంచనా. రూ. 1.6 లక్షల కోట్ల విలువైన ఈ బొగ్గు గనుల వెలికితీత కాంట్రాక్ట్ను అదానీ కంపెనీ చేజిక్కించుకొన్నది. ఈ వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్టు పలు విమర్శలు కూడా వచ్చాయి. ఇక, బొగ్గు నిక్షేపాలను వెలికితీసే పనులను 2022 వరకు కొనసాగించిన అదానీ గ్రూప్ .. గనులకు సమీపంలో ఉన్న వందల కోట్ల రూపాయల అటవీ భూములపై పడినట్టు ‘స్క్రోల్’ కథనంలో వెలువరించింది. ఆప్తమిత్రుడికి లబ్ధి చేకూర్చడానికి.. నిబంధనలను మార్చివేసిన కేంద్రం.. గత ఏడాది ఫిబ్రవరిలో బొగ్గు గనుల విస్తరణకు అదానీ కంపెనీకి అనుమతులను మంజూరు చేసినట్టు తెలిపింది. తద్వారా అత్యంత విలువైప 3 వేల ఎకరాల అటవీ భూమిలో అదానీ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వీలుకలిగినట్టు వివరించింది.
బొగ్గు నిక్షేపాల వెలికితీతలో భాగంగా అదానీ కంపెనీకి అదనంగా భూములను కేటాయించాల్సిన అవసరం లేదని మే 2019, ఫిబ్రవరి 2021 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదికల్లో కేంద్రానికి సూచనలు చేశాయి. భూమి ఉపరితలానికి తక్కువ లోతులోనే ఉన్న బొగ్గును నిలువుగా డ్రిల్లింగ్ చేసి వెలికితీసే వెసులుబాటు ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా అదానీ గ్రూప్ వెలికితీత పనులను సమాంతర మార్గంలో విస్తరిస్తూ పోతున్నదని తెలిపాయి. దీంతో పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదమున్నదని హెచ్చరించాయి. అయినప్పటికీ, కేంద్రప్రభుత్వం ఈ నివేదికలను పట్టించుకోకుండా అనుమతులను మంజూరు చేసింది. అయితే, కేంద్రం ఆదేశాలను అక్కడి ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ ప్రక్రియను నిలిపేసింది.