అభివృద్ధి పనులపై బేధాభిప్రాయాలు
ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదు
విచారణ చేపట్టిన డీఎల్పీవో
నవాబ్పేట, ఏప్రిల్ 17 : గ్రామాభివృద్ధిలో ఒకరికొకరు సహకరించుకొని ముందుకు సాగాల్సిన ప్రజాప్రతినిధులు గతేడాది నుంచి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గ్రామంలో చేపట్టే పనులపై అభిప్రాయ బేధాలు రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురికావడమే కాకుండా.. గ్రామాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నది. ప్రజాప్రతినిధుల వివాదంపై శనివారం డీఎల్పీవో వరలక్ష్మి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కేశవరావుపల్లి గ్రామానికి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా రజిని, ఉపసర్పంచ్గా సంతోష్కుమార్ ఎన్నికయ్యారు. వీరిద్దరూ గెలుపొందినప్పటి నుంచి గ్రామాభివృద్ధిలో ఒకరిపై ఒకరికి పొసగడం లేదు. గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించిన చెక్కులపై ఉపసర్పంచ్ సంతోష్కుమార్ సంతకాలు పెట్టకుండా వేధిస్తున్నాడంటూ సర్పంచ్ రజిని ఐదారు నెలల నుంచి డీపీవో, డీఎల్పీవోలకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు.
సర్పంచ్ రజిని గ్రామంలో ఉండకుండా షాద్నగర్లో ఉంటూ అభివృద్ధి పనుల విషయంలో తనకు సమాచారం ఇవ్వకుండా భర్తతో కలిసి ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారని ఉపసర్పంచ్ సంతోష్కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరడంతో శనివారం డీఎల్పీవో వరలక్ష్మి గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. రికార్డులను పరిశీలించి గతేడాది నుంచి అభివృద్ధి పనులకు వినియోగించిన నిధుల వివరాలను సేకరించారు. చేపట్టిన పనులు ఎందుకు మధ్యలో నిలిపివేశారని నిలదీశారు. అనంతరం గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తానని డీఎల్పీవో తెలిపారు. ఇద్దరిలోనూ మార్పు రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీవో భద్రునాయక్, నాయకులు రమేశ్, యాదయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మరో రికార్డుకు చేరువలో టీసీఎస్! అదేంటంటే?!
డేవిడ్ వార్నర్ రనౌట్..ఒత్తిడిలో రైజర్స్