న్యూఢిల్లీ, ఆగస్టు 18: టెలికం కంపెనీలు 5జీ సర్వీసులు ప్రారంభించడానికి సంసిద్ధంకావాలని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయా సంస్థల్ని కోరారు. 5జీ స్పెక్ట్రంను కేటాయిస్తూ టెలికం శాఖ తక్షణ చెల్లింపులు చేసిన బిడ్డర్లకు లేఖలు జారీచేసిందని మంత్రి గురువారం సోషల్ మీడియాలో తెలిపారు.
ఇటీవల స్పెక్ట్రం వేలంలో పాల్గొన్న భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ఐడియా, అదాని డాటా నెటవర్క్స్ నుంచి టెలికం శాఖకు రూ. 17,876 కోట్లు అందింది. దీంతో శాఖ ఆయా సంస్థలకు స్పెక్ట్రం అసైన్మెంట్ లేఖలు జారీచేసింది. వేలంలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన బిడ్స్ను కంపెనీలు వేశాయి.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో అన్ని కంపెనీలకంటే అధికంగా రూ.87,947 కోట్ల విలువైన స్పెక్ట్రంకు బిడ్ చేసింది. బిడ్డింగ్లో పాల్గొన్న కంపెనీలన్నీ బిడ్ మొత్తాన్ని 20 వార్షిక వాయిదాల్లో చెల్లించేందుకు మొగ్గుచూపాయి.